జాగ్రత్త: ఇకపై మీ కంప్యూటర్లను ఈ కేంద్ర నిఘా సంస్థలు పర్యవేక్షిస్తాయి
మీ కంప్యూటర్లో ఏదైనా రహస్య సమాచారం ఉంచారా..? నిబంధనలకు వ్యతిరేకంగా సమాచారాన్ని స్టోర్ చేసి పెట్టారా..? ఇక పై మీ కంప్యూటర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిత్యం పర్యవేక్షణలో ఉంచుతాయి. ఒకమాటలో చెప్పాలంటే నిఘా నేత్రం మీకంప్యూటర్పై పడుతుంది. ఈ మేరకు 10 కేంద్ర భద్రతా సంస్థలకు కంప్యూటర్లపై నిఘా ఉంచాల్సిందిగా అధికారాలిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ.
అంటే మీ కంప్యూటర్ను మొత్తం మానిటరింగ్ చేసి అందులోని సమాచారాన్ని కూడా బయటకు తోడేసే అధికారాలు కేంద్రం భద్రతా సంస్థలకు కట్టబెట్టింది. మీరు ఎలాంటి సమాచారం ఇతరులకు పంపుతున్నారో.... ఎలాంటి సమాచారం మీకు ఇతరుల నుంచి మీ కంప్యూటర్కు చేరుతుందోలాంటి అంశాలపై ఇక నిత్యం నిఘా ఉండనుంది.
సమాచారా సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69కింద ఈ అధికారాలు భద్రతా సంస్థలకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దేశ భద్రతకు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ, డెరెక్టొరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, జాతీయ విచారణ సంస్థ కేబినెట్ సెక్రటేరియట్ (రా), డైరెక్టొరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ (జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, అస్సోం) మరియు ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంస్థలకు కంప్యూటర్ల పర్యవేక్షణకు కేంద్రం అధికారాలు ఇచ్చింది.
ఇప్పటి వరకు తాజా సమాచారం మాత్రమే పొందేందుకు వీలుగా ఉండేదని... ఇక కొత్తగా జారీ అయిన అధికారాలతో పాత సమచారంతో పాటు స్టోర్ చేసి ఉంచిన సమాచారం, కంప్యూటర్కు ఇతరుల నుంచి వచ్చిన సమాచారం కూడా పొందే అధికారం వచ్చిందని కేంద్రంలోని ఓ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ అధికారాలు ఒక్క కాల్స్, లేదా ఈమెయిల్స్కు మాత్రమే పరిమితం కాదు.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సమాచారమైనా కంప్యూటర్ నుంచి తీసుకోవడంతో పాటు కంప్యూటర్ను సీజ్ చేసే అధికారం ఉందని తెలిపారు.
అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరోకు కంప్యూటర్ను సీజ్ చేసే అధికారాలు ఉండేవికాదు. కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని కేంద్రం ఇచ్చింది. మరోవైపు కంప్యూటర్కు సంబంధించిన వ్యక్తి లేదా సర్వీస్ ప్రొవైడర్లు కేంద్ర సంస్థలకు సహకరించాల్సి ఉంటుందని ఆదేశాల్లో కేంద్రం పొందుపరిచింది. కేంద్ర సంస్థలకు సహకరించని నేపథ్యంలో వారికి జరిమానా విధించడంతో పాటు ఏడేళ్లు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.