శరీరం నుంచి వేరుచేయబడ్డ ఈ చేతులు ఎవరివి..?
ఒడిషాలోని జాజ్పూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం రోజు శరీరం నుంచి వేరుచేయబడ్డ 10 చేతులు దొరికాయి. ఈ చేతులన్నీ మృతి చెందిన గిరిజనులవిగా తెలుస్తోంది. 2006లో పోలీసుల కాల్పుల సందర్బంగా వీరంతా మృతిచెందారు. ఓ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కలింగనగర్ ప్రాంతంలో భూసేకరణ చేస్తుండగా దీన్ని నిరసిస్తూ కొందరు గిరిజనులు ధర్నాకు దిగారు. తమ భూములు కొల్లగొట్టొద్దంటూ ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కాల్పులు జరిపారు. జనవరి 2006 లో చోటుచేసుకున్న ఈ ఘటనలో 13 మంది గిరిజనులు మృతి చెందారు.
జాజ్పూర్లోని ఓ క్లబ్లో ఐదు జతల చేతులను ఓ బాక్స్లో ఉంచారు. అయితే శనివారం కొందరు దుండగులు క్లబ్ కిటికీలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి చేతులు ఉంచిన ఆ మెడికల్ బాక్స్ను తీసుకెళ్లారని జాజ్పూర్ ఎస్పీ సీఎస్ మీనా తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి హింసాత్మకమైన ఘటనలు జరగలేదని చెప్పిన ఎస్పీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసుల బలగాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇదిలా ఉంటే 2006 పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గిరిజనులను గుర్తుపట్టేందుకు వీలు లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతుల చేతులను కట్ చేశారు. వాటి వేలిముద్రల ఆధారంగా గుర్తు పట్టే అవకాశం ఉంటుందన్న భావనతో డాక్టర్లు చేతులను వేరు చేసి మెడికల్ బాక్స్లో భద్రపరిచారు. అయితే ఈ చేతులను మృతుల కుటుంబాలకు కొన్నేళ్ల క్రితమే అప్పగించారు. కానీ వారు తీసుకునేందుకు నిరాకరించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఆ చేతులను ఒక మెడికల్ బాక్స్లో ఉంచి భద్రపరిచారు.