పది రోజుల్లో పెళ్లి: వరుడి ప్రాణాలు తీసిన సెల్ఫీ
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని సర్దార్పురలో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో పది రోజుల్లో పెళ్లి ఉందనగా ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిఖిల్ ప్రజాపత్(23) అనే యువకుడికి మరో 10 రోజుల్లో పెళ్లి నిశ్చయించారు పెద్దలు.
ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి సరదాగా జోధ్పూర్లోని మేరంగడ్ కోటకు వెళ్లాడు. స్నేహితులు ఎంత చెప్తున్నా వినకుండా సెల్ఫీ కోసం కోటపైకి ఎక్కి కాలుజారి పడిపోయాడు. స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడే మృతిచెందాడు.
ఆటో ఎలక్ట్రిక్ షాపులో పని చేస్తున్న నిఖిల్ మృతితో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
భర్తను చంపాలనుకుంటే.. కూతురు బలైంది
త్రిపుర: ఓ మహిళ తన భర్తను చంపేందుకు వేసిన ప్లాన్ వికటించి.. ఓ కూతురు ప్రాణం తీయగా, మరో కూతురు ఆస్పత్రి పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. అగర్తాలాలోని గోవింద సర్దార్పారాకు చెందిన సీతారాణి దెబ్బర్మా(29) తన రెండో భర్తను చంపాలనుకుంది.
ఇందు కోసం టీలో విషం కలిపింది. అయితే అనుకోకుండా ఆ విషం కలిపిన టీని తన ఇద్దరు కూతుళ్లు సేవించారు. శ్రియ(4) మృతి చెందగా, మెరీ(12) ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.