ఘోర విషాదం : వ్యాను బోల్తా పడి 10 మంది మృతి... 20 మందికి గాయాలు...
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివపురి జిల్లాలోని పోహ్రిలో ఓ వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా... 20 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 7.15గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీస్ అధికారి వెల్లడించారు. షియోపూర్ జిల్లాలోని ఉనావాడ్ గ్రామంలో ఓ ఆధ్యాత్మిక గ్రామంలో పాల్గొన్న బృందం... వ్యానులో తిరిగి తమ స్వగ్రామం దోదికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు.
మృతుల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా... మరో నలుగురు ఆస్పత్రిలో మృతి చెందినట్లు శివపురి ఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని... ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే ప్రమాద కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.
Recommended Video
భోపాల్ నగరంలోనూ శుక్రవారం(నవంబర్ 13) ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా... ఇద్దరు గాయపడ్డారు. మృతుడిని భవానీ ధామ్ బిల్డర్ మేనల్లుడు మహేష్ సింగ్ రాజ్పుత్(21)గా గుర్తించారు. అవధ్పురి బైపాస్లో ఉన్న ఓ దాబాకి స్నేహితులతో కలిసి కారులో వెళ్లిన మహేష్.. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆగి వున్న ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరినీ హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించామన్నారు.