ట్రాక్టర్ను ఢీకొన్న రైలు: పది మంది మృతి, 30 మందికి గాయాలు
బిజ్నోర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మానవరహిత రైలు రోడ్డు క్రాసింగ్ వద్ద ట్రాక్టర్ను రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు బుధవారం చెప్పారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ట్రాక్టర్ వ్యాగన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ సమీపంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సంభవించింది.
వ్యాగన్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. వారంతా గంగానది సమీపంలోని ఓ పవిత్ర స్థలానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మీరట్లోని ఆస్పత్రిలో క్షతగాత్రులను చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మానవరహిత లెవెల్ క్రాసింగ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.