యూపీలో విషాదం: సిలిండర్ పేలి బిల్డింగ్ కూలడంతో 10 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్: ఉత్తర్ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. మావ్ జిల్లా మొహమ్మదాబాద్లో సిలిండర్ పేలడంతో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి.
ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోరారు. అదే సమయంలో భవంతిలో చిక్కుకున్న వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
7 dead and 15 injured after a two-storey building collapsed following a cylinder blast at a home in Mohammadabad, Mau. Several feared trapped. More details awaited. pic.twitter.com/cFr7Q0pEr4
— ANI UP (@ANINewsUP) October 14, 2019
ప్రాథమిక విచారణ ప్రకారం గ్యాస్ లీకవడం ఆ తర్వాత సిలిండర్ పేలిపోవడంతోనే ఘటన జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పేలుడు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మంటు చెలరేగడం, ఆపై మంటలు ఇంటికి వ్యాపించడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇంట్లో నుంచి పెద్దగా మంటలు చెలరేగడం చూసిన స్థానికులు చిక్కుకున్న వారిని రక్షించేందుకు పరుగులు తీశారు. చూస్తుండగానే ఇళ్లు కాలిపోయి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇళ్లు కూలడంతో దానికింద పడి నలిగి 10 మంది వరకు చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.