కరోనా రక్కసిని జయించిన 10 నెలల బాలుడు, 8 రోజుల్లోనే మహమ్మారి ఔట్, కేరళలో మూడేళ్ల బాలుడు కూడా...
మహమ్మారి కరోనా వైరస్ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచంలోని ప్రతీ దేశం వైరస్ బారిన పడి విలవిలలాడుతూనే ఉంది. వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతోన్న దాని ప్రకారం.. చిన్నపిల్లలు, వృద్దుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటున్నందున వారిపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇటలీలో శతాధిక వృద్దుడు వైరస్ బారినుంచి కోలుకుని దీనిని పటాపంచల్ చేశాడు. ఇటు తమిళనాడులో 10 నెలల బాలుడు కూడా కరోనా వైరస్పై యుద్ధం చేసి విజయం సాధించాడు. దీంతో పిల్లులు, వృద్దులపై ఎక్కువ ప్రభావం ఉంటుందా అనే అంశం చర్చకు దారితీసింది.
చిన్నారికి వైరస్..
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బాలుడికి కరోనా వైరస్ సోకింది. అతని కుటుంబసభ్యులతోపాటు గతనెల 29వ తేదీన ఈఎస్ఐ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అప్పటినుంచి చిన్నారిని వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అయితే బాలుడికి వైరస్ తగ్గడంతో 8 రోజుల తర్వాత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైరస్ తగ్గిన ఐదుగురిలో బాలుడి తల్లి, అమ్మ్మ, 25 ఏళ్ల వ్యక్తి సహా మరొకరు డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చిన వారి వల్ల బాలుడి తల్లి.. తద్వారా చిన్నారికి వైరస్ సోకిందని అధికారులు చెబుతున్నారు. బాలుడు కోలుకోవడంతో తమిళనాడు వైరస్ బారినపడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12కి చేరుకున్నది.
కేరళలో ఫస్ట్ కేసు..
దేశంలో కరోనా వైరస్ సోకిన తొలి చిన్నారి కేరళ రాష్ట్రానికి చెందినవారు. మార్చి మొదటివారంలో ఇటలీ నుంచి దుబాయ్ మీదుగా కొచ్చి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలుడికి వైరస్ సోకింది. తర్వాత తన పేరెంట్స్తోపాటు చిన్నారికి వైద్యులు చికిత్స అందించారు. దీంతో బాలుడితోపాటు అతని తల్లిదండ్రులు కూడా కోలుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు చెందిన 10 నెలల బాలుడు కోలుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Recommended Video
నిన్న ఒక్కరోజే 50..
తమిళనాడులో కూడా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. సోమవారం ఒక్కరోజే 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 621కి చేరుకున్నది. వైరస్ వల్ల 19 మంది చనపిోయారు. సోమవారం 57 ఏళ్ల మహిళ చనిపోయారు. ఈ నెల 5వ తేదీన ఆమె శ్వాసకోశ సమస్యతో రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరారు. మరునాడు ఆమె చనిపోయారని.. తర్వాత పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని తమిళనాడు అధికారులు ప్రకటించారు.