డాక్టర్లను తరిమి కొట్టిన కాలనీలో 10 కరోనా పాజిటివ్ కేసులు: ఢిల్లీ మత ప్రార్థనలతో లింకు
భోపాల్: మధ్యప్రదేశ్లో సంచలనం రేపిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చోటు చేసుకున్న ప్రాంతంలో ఏకంగా 10 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. మర్కజ్ సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని ఇంటికి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలను నిర్వహించడానికి వెళ్లిన సమయంలో మహిళా డాక్టర్లపై దాడి చోటు చేసుకుంది.
Recommended Video
ఇండోర్లోని తట్పట్టి భాకల్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చారు. కరోనా పేషెంట్ అనే ముద్ర వేస్తారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఇండోర్ వైద్యాధికారులు అతని పేరు, చిరునామా, ఫోన్ నంబర్లను ఢిల్లీ పోలీసుల నుంచి సేకరించారు. ఆ సమాచారం మేరకు అతనికి వైద్య పరీక్షలను నిర్వహించడానికి ఆసుపత్రికి రావాలని ఫోన్ ద్వారా సూచించారు. దీన్ని అతను పట్టించుకోలేదు.
దీనితో ఇండోర్ వైద్యాధికారులు అతని ఇంటికి అంబులెన్స్ను పంపించారు. ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బంది అతని ఇంటికి వెళ్లగా వైద్య పరీక్షలకు నిరాకరించాడు. ఈ విషయాన్ని తన వీధిలో వారందరికీ తెలియజేశాడు. దీనితో సుమారు 50 మంది అతని ఇంటికి చేరుకున్నారు. డాక్టర్లతో గొడవ పడ్డారు. వారితో ఘర్షణకు దిగారు. తరిమి కొట్టారు. చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. రాళ్లు రువ్వారు. ఈ దాడిలో డాక్టర్లకు తీవ్రత గాయాలయ్యాయి. ఇప్పుడు అదే కాలనీలో ఏకంగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకం రేపుతోంది.
కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన వారందరూ 29 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న కారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడి అనంతరం తట్పట్టి భాకల్ ప్రాంతానికే చెందిన పలువురు అనారోగ్యానికి గురయ్యారు. మొత్తం 16 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను నిర్వహించుకున్నారు. వారి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపించారు. ఆదివారం వారి నివేదికలు వచ్చాయి. ఈ 16 మందిలో 10కి కరోనా వైరస్ సోకినట్లు తేలిందని ఇండోర్ జిల్లా ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.