ఘోర విషాదం.. ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం... 10 మంది నవజాత శిశువుల మృతి...
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భందరా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ గది మొత్తం పొగ వ్యాపించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది చిన్నారులు ఐసీయూలో ఉన్నారు. వీరిలో ఏడుగురు శిశువులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.మృతి చెందిన శిశువుల్లో ఎక్కువమంది నెల నుంచి మూడు నెలల వయసులోపు వారే ఎక్కువగా ఉన్నారు.
Recommended Video
విచారణకు ఆదేశించిన సీఎం... పరిహారం...
భందారా జిల్లా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేను అక్కడి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరారు. మృతి చెందిన నవజాత శిశువుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్రంలోని మిగతా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులను కూడా పరిశీలించాల్సిందిగా అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనపై సమాచారం అందినవెంటనే ఆరోగ్య శాఖ మంత్రితో పాటు జిల్ాా కలెక్టర్,భందారా ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడినట్లు ట్విట్టర్ ద్వారా సీఎం వెల్లడించారు.
ఆస్పత్రి వైద్యులు ఏమంటున్నారు...
భందారా జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడు మాట్లాడుతూ... రాత్రి 2గంటల సమయంలో నవజాత శిశువులను ఉంచిన ఎస్ఎన్సీయూలో మంటలు చెలరేగినట్లు చెప్పారు. వార్డులో మొత్తం 17 మంది శిశువులు ఉండగా ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మరో వైద్యుడు మాట్లాడుతూ... ఎస్ఎన్సీయూలో పొగ వ్యాపించడాన్ని మొదట ఓ నర్సు గమనించి వైద్యులను,ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేసిందన్నారు. ఐదు నిమిషాల్లో అంతా అక్కడికి చేరుకున్నామని చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు.
మోదీ,అమిత్ షా,రాహుల్ గాంధీ ట్వీట్స్...
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. భందారా హృదాయ విదారక ఘటనలో విలువైన నవజాత శిశువుల ప్రాణాలు కోల్పోయామన్నారు. మృతి చెందిన శిశువుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటన అత్యంత దురదృష్టకరం అన్నారు.ఈ విచారాన్ని మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నానని అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.