కర్ణాటక టు గోవా.. సీఎల్పీ బీజేపీలో విలీనం : స్పీకర్కు లేఖ అందజేత
పనాజీ : కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన ప్రభను కోల్పోతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్టీకి మరింత చీకటి అవహించింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ను తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముప్పుతిప్పలు పెడుతున్న వేళ .. ఆ పార్టీకి గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో షాక్ ఇచ్చారు. తాము బీజేపీలో చేరుతున్నట్టు స్పీకర్ రాజేశ్కు లేఖ అందజేశారు. వీరికి సీఎల్పీ నేత చంద్రకాంత్ కవలేఖర్ నేతృత్వం వహిస్తుండటం హస్తం అధినేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
వాస్తవానికి గోవాలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ బీజేపీ ఇండిపెండెంట్, గోవా ఫార్వర్డ్ పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. 40 అసెంబ్లీ స్థానాలు గల గోవాలో కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ను కలిశారు. వీరికి ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవలేఖర్ నేతృత్వం వహించారు. బుధవారం సాయంత్రం స్పీకర్ను కలిసి తమను బీజేపీలో విలీనం చేయాలని కోరారు. దీనిని గోవా స్పీకర్ కూడా ధ్రువీకరించారు.
మరోవైపు అసెంబ్లీలో తమ బలం పెరిగిందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో గోవాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు అధికారి బీజేపీ బలం మాత్రం 27కి చేరింది. మరోవైపు తమ బలం పెరిగినందున ప్రభుత్వంలో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్, ఇతర మంత్రులకు చెక్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ప్రభుత్వం కొనసాగించేందుకు తమకే మద్దతు ఉన్నందున వారి డిమాండ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని భావనలో ఉన్నారు సీఎం.