పార్లమెంటులో క్లియర్: పేదలకు 10% బిల్లుకు రాజ్యసభ ఆమోదం, 'మోడీ సిక్సర్ కొట్టారు'
న్యూఢిల్లీ: పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాజ్యసభలోను ఆమోదం పొందడంతో పార్లమెంటులో ఈ బిల్లు పాసయింది. బిల్లు పైన రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది.
అనంతరం డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 149 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఏడుగురు సభ్యులు ఓటు వేశారు. బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలన్న సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 18 మంది సభ్యులు, వ్యతిరేకంగా 155 మంది సభ్యులు ఓటు వేశారు.
అంతకుముందు కేంద్రమంత్రి థావర్చంద్ గెహ్లాట్ మాట్లాడారు. ఈబీసీలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ బిల్లు తెచ్చారని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారి చేయూతకు ఇంతకన్నా మంచి ఉపాయమేమైనా ఉందా అన్నారు. రెండు, మూడు పార్టీలు తప్ప అన్ని రాజకీయ పక్షాలు బిల్లుకు మద్దతిస్తున్నాయన్నారు. బిల్లులో భాగస్వాములైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ బిల్లుపై అంతకుముందు ఆయా పార్టీల నేతలు మాట్లాడారు. దాదాపు అన్ని పార్టీల నేతలు బిల్లును ఆమోదిస్తూనే.. ఇది రాజకీయమని విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ సవరణ తీసుకు వచ్చేది ఇలాగేనా అని సీపీఐ ఎంపీ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నరేంద్ర మోడీ సిక్సర్ కొట్టారని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ మద్దతుతోనే మూడుసార్లు సీఎం అయ్యారని, అలాంటప్పుడు ఆమె అదే పార్టీని ఎస్సీ వ్యతిరేకి అనడం సరికాదన్నారు.