రాజ్యసభలో సెంచరీకి పెరిగిన బీజేపీ బలం: యూపీ నుంచి కొత్తగా 8 మంది ఏకగ్రీవం..92కు చేరిన సంఖ్య
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 మంది రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 8 మంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందినవారు కాగా, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) పార్టీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
బీజేపీ నుంచి ఎన్నికైన వారిలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ, అరుణ్ సింగ్, హరిద్వార్ దూబే, బ్రిజ్ లాల్, నీరజ్ శేఖర్, గీత శక్య, సీమ ద్వేది, బీఎల్ వర్మ ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రాంజీ గౌతమ్ రాజ్యసభకు ఎన్నికైనవారిలో ఉన్నారు.
బీఎస్పీ నుంచి పోటీ చేసిన రాంజీ గౌతమ్పై ప్రకాశ్ బజాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇతనికి ఎస్పీ మద్దతు పలికింది. అయితే, చివరి నిమిషంలో ఆయన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కేవలం పది ఓట్లతోనే బీఎస్పీ తన అభ్యర్థిని గెలిపించుకుంది.
ఇది ఇలావుండగా, ఉత్తరాఖండ్లో బీజేపీ నేత నరేష్ బన్సాల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. నవంబర్ 9న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ పోటీలో ఏ పార్టీ కూడా అభ్యర్థిని నిలపకపోవడంతో బన్సాల్ ఎన్నిక ముందే ఖరారైపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం 70 అసెంబ్లీ స్థానాలుండగా, 56 బీజేపీనవే కావడం గమనార్హం. దీంతో పోటీకి ఏ పార్టీ కూడా అభ్యర్థిని బరిలో దింపలేదు.
కాగా, రాజ్యసభలో బీజేపీకి తాజా విజయాలతో బలం పెరిగింది. కొత్త సభ్యుల చేరికతో బీజేపీ పెద్దలసభలో 92కు చేరింది.