త్వరలో గోవా క్యాబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశం?, నడ్డాతో సీఎం సావంత్ భేటీ
న్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ హైకమాండ్ వద్దకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. గోవాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వారిని వెంటపెట్టుకుని ఢిల్లీ వచ్చారు సీఎం. తొలుత జేపీ నడ్డా, తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గోవాలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే సంకేతాలను ఇచ్చారు.
పెరిగిన మద్దతు
గోవా అసెంబ్లీలో 40 సీట్లు ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో బీజేపీ గోవా ఫార్వార్డ్ పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే విపక్ష కాంగ్రెస్ మాత్రం 15 ఎమ్మెల్యేలతో బలంగా ఉంది. నిన్న సీఎల్పీ నేత చంద్రకాంత్ కవలేఖర్తోపాటు 10 మంది ఎమ్మెల్యేల కాషాయ కండువా కప్పుకొని ఆ పార్టీకి షాకిచ్చారు. ఈ క్రమంలో గోవా ఫార్వార్డ్ పార్టీ, ఇండిపెండెంట్లకు చెక్ పెట్టాలని సీఎం ప్రమోద్ భావిస్తున్నారు.
క్లారిటీ వచ్చింది
నడ్డాను కలిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. గోవా మంత్రివర్గంపై నడ్డా, అమిత్ షా, పార్టీ పెద్దల అనుమతి తీసుకొని విస్తరిస్తామని పేర్కొన్నారు. దీంతో కొందరికి పదవులు పోయే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. తమ బలం పెరిగినందున ప్రభుత్వంలో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్, ఇతర మంత్రులకు చెక్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ప్రభుత్వం కొనసాగించేందుకు తమకు మద్దతు ఉన్నందున వారి డిమాండ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని భావనలో ఉన్నారు సీఎం.
నిరసన పర్వం
మరోవైపు గోవా, కర్ణాటక రాజకీయాలను తప్పుపడుతూ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆనంద్ శర్మ నిరసన తెలిపారు. గోవాతోపాటు కర్ణాటక రాజకీయ అస్థిరతను గుర్తుచేస్తూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అరవడంతో ఆ ప్రాంగణం మిన్నంటింది. ఎన్డీఏ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు.