ఆపరేషన్ లోటస్: సిక్కింలో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి జంప్.. ఏం జరగబోతోంది..?
సిక్కిం: దేశవ్యాప్తంగా కమలం పార్టీ జెండా ఎగురవేసేందుకు క్రమంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ లోటస్లో భాగంగా నిన్నటికి నిన్న కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోగా.. ఇక తాజాగా ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసినట్లు కనిపిస్తోంది. తాజాగా సిక్కింలో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ నుంచి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు కమల తీర్థం పుచ్చుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్క సీటు కూడా లేని బీజేపీలో 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారు.. కమలనాథుల ప్లాన్ ఏంటి..?
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం...కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం
కమలం పార్టీలోకి 10 మంది ఎస్డీఎఫ్ ఎమ్మెల్యేలు
ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే కమలం వికసిస్తుండగా తాజాగా సిక్కిం రాష్ట్రంలో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు ఫిరాయించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్మాధవ్ల సమక్షంలో 10 మంది ఎమ్మెల్యేలు కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. 32 మంది సభ్యులున్న సిక్కిం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్లో కేవలం 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. దీంతో సిక్కిం అసెంబ్లీలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కినట్లయ్యింది. వాస్తవానికి బీజేపీ ఒక్క సీటు కూడా సిక్కింలో గెలవలేదు. సిక్కిం క్రాంతికారీ మోర్చా పార్టీ 17 సీట్లు గెలువగా... ఎస్డీఎఫ్ 15 స్థానాలు గెలుచుకుంది.
ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా బీజేపీలోకి...
ఇక బీజేపీ తీర్థం పుచ్చుకున్న సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డోర్జీ షెరింగ్ లేప్చా ఉన్నారు. ఈయన పవన్ చామ్లింగ్ కేబినెట్లో మూడు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉజెన్ గ్యాత్సో కూడా పార్టీ జంప్ కొట్టారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లుక్ ఈస్ట్ పాలసీ తమను ఎంతగానో ఆకట్టుకుందని లేప్చా చెప్పారు. చైనా, భూటాన్, నేపాల్లతో సిక్కిం రాష్ట్రం సరిహద్దు కలిగి ఉందన్న విషయాన్ని లేప్చా హైలైట్ చేశారు.
సిక్కింలో బీజేపీ జెండా ఎగరబోతోందా...?
ఇదిలా ఉంటే ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీలోకి ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు మారడం ఇదే తొలిసారి కావడం విశేషం. సిక్కింలో కూడా కమలం పార్టీ వికసించాలని తాము కోరుకుంటున్నట్లు ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్పారు. ఇదిలా ఉంటే పవన్ కుమార్ చామ్లింగ్ సీఎంగా సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ 25 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నింది. అంతేకాదు సుదీర్ఘ కాలంగా సీఎంగా పనిచేసిన వ్యక్తిగా పవన్ చామ్లింగ్ ఓ రికార్డును కూడా క్రియేట్ చేశారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం గట్టి పోటీని ఇచ్చిన పవన్ చామ్లింగ్ పార్టీ సిక్కిం క్రాంతికారీ మోర్చా చేతిలో ఓటమి పాలైంది.