మామూలోడుకాదు!: తాజ్ మహల్, పార్లమెంట్, ఎర్రకోటనూ అమ్మేశాడు!!
పాట్నా: ఓ తెలుగు సినిమాలో చార్మినార్, గోల్కొండ కోటను అమ్మేసే సన్నివేశాలు నవ్వులు పుట్టిస్తే.. ఇక్కడ వాస్తవంగా జరిగిన ఘటనలు మాత్రం షాక్ కి గురిచేస్తాయి. ఎందుకంటే ఓ వ్యక్తి.. ఏకంగా తాజ్ మహల్, పార్లమెంట్, ఎర్రకోటలను తన ఆస్తిగా ప్రకటించుకుని ఆమ్మేశాడు. తాజ్ మహల్ ను అయితే ఏకంగా మూడు సార్లు అమ్మడం విశేషం. ఆయనే బీహార్ రాష్ట్రంలోని బాంగ్రా గ్రామానికి చెందిన నట్వర్ లాల్.
అంతేగాక, న్యాయవాది అయిన నట్వర్ లాల్ ఎవరి సంతకాన్నైనా.. అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసేవాడట. ఆ ప్రతిభతోనే మొదట టాటా, బిర్లా, ధీరూభాయి అంబానీలాంటి ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేసి, చెక్కుల ద్వారా వారి బ్యాంకు ఖాతాల నుంచి లక్షల రూపాయలు డ్రా చేసేవాడు.
అంతటితో ఆగలేదు ఆయనగారి ఆగడాలు. తనను తాను ప్రభుత్వాధికారిగా చెప్పుకుని, మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల సంతకాలనూ ఫోర్జరీ చేసి.. విదేశీయులకు తాజ్మహల్ను మూడుసార్లు అమ్మేశాడు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్తో పాటు ఇంకెన్నో ప్రభుత్వ ప్రాచీన కట్టడాలనూ అమ్మేశాడు. అంతేగాక, పార్లమెంటునైతే అందులోని ఎంపీలతో సహా అమ్మేయడం కొసమెరుపు.
ఇలాంటి వందకు పైగా నేరాలకు గానూ నట్వర్లాల్కు 113ఏళ్ల శిక్ష పడింది. కానీ అతడు ఇరవయ్యేళ్లకు మించి శిక్షను అనుభవించలేదు. జైలు నుంచి తొమ్మిదిసార్లు తప్పించుకుని పారిపోయాడం గమనార్హం. 84ఏళ్ల వయస్సులో 1996లో తప్పించుకోవడం విశేషం. చక్రాల కుర్చీలో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే రైల్వేస్టేషన్లో మాయమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఎవరికీ కనిపించలేదు.
కాగా, నట్వర్ లాల్ మరణం కూడా మిస్టరీగానే మిగిలింది. ఇది ఇలా ఉండగా, నట్వర్లాల్ కథతో బాలీవుడ్లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఇక, నట్వర్లాల్ స్వగ్రామానికైతే అతడు ఎప్పుడూ హీరోగానే ఉన్నాడు. ఎందుకంటే నట్వర్లాల్ దోచుకొచ్చిన సొమ్మునంతా పేదవాళ్లకు పంచేవాడట. ఈ నేపథ్యంలోనే ఇటీవల నట్వర్ లాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆ గ్రామస్తులు సిద్దమవ్వడం కొసమెరుపు.