విశ్వాస పరీక్షల్లో వంద శాతం విజయం సాధిస్తా: యడ్యూరప్ప
బెంగుళూరు: విశ్వాస పరీక్షల్లో వంద శాతం విజయం సాధిస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాదు ఐదేళ్ళ పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలనను అందించనున్నట్టు ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యడ్యూరప్ప గురువారం నాడు బెంగుళూరులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, జెడి(ఎస్) పొత్తుపై యడ్యూరప్ప మండిపడ్డారు. ఈ పొత్తు అనైతికమైందన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్, జెడి(ఎస్)లను తిరస్కరించారని ఆయన చెప్పారు.
బిజెపికి మద్దతిచ్చి గెలిపించినందుకు కర్ణాటక ప్రజలకు యెడ్డీ ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా తమకు మద్దతిచ్చిన ఎస్సీ, ఎస్టీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి తనను ముఖ్యమంత్రిగా చేసినందుకు కన్నడ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.రైతుల కోసం, వారి శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు.
బలనిరూపణ పట్ల తమకు నమ్మకముందని యడ్యూరప్ప అన్నారు. తమ ప్రభుత్వం అయిదేళ్ల పాలన పూర్తిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శాసనసభ్యులందరినీ తమ మనస్సాక్షి మేరకు ఓటు వేయాలని కోరతానని చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించాలని అడుగుతానని యెడ్డీ పేర్కొన్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ ఫలితాల తర్వాత అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు విషయమై కూడ ఆయన స్పందించారు. తాను న్యాయస్థానాన్ని గౌరవిస్తానని, సుప్రీంకోర్టులో ఉన్న అంశాలపై స్పందిచనని చెప్పారు.