100మంది యువతుల అక్రమ రవాణా: దేశం దాటించేశారు, కానీ..
ముంబై: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మానవ అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నాయి. తాజాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ మానవ అక్రమ రవాణా గుట్టు వీడింది. ఏకంగా 100మంది యువతులను దేశ సరిహద్దులను దాటించారు. వీరంతా 14-16ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
ముంబై కేంద్రంగా..
ముంబై కేంద్రంగా ఈ మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు నగర క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. గత మూడేళ్లుగా అమాయక యువతులకు మాయమాటలు చెప్పి ప్యారిస్ నగరానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారు. పిల్లలకు మంచి విద్య, తల్లిదండ్రుల స్థితిగతుల్లో మార్పులు చేస్తామంటూ నిందితులు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్యారిస్ పంపేయత్నం..
దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో సునీల్ నంద్ వానీ, నర్సయ్య, ముంజలి అనే వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఉండటంతో వారిని అరెస్ట్ చేసినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నందవానీ అనే వ్యక్తి ఇటీవలే ఐదు నుంచి ఆరుగురు మైనర్లను, ముంజలి మరో ఇద్దరినీ ప్యారీస్ పంపించే ప్రయత్నం చేయగా.. వారికి ఫ్రెంచ్ వీసాల దొరకకపోవడంతో సాధ్యం కాలేదు.
మైనర్ యువతులే..
14 నుంచి 16ఏళ్ల లోపు మైనర్లను ఫ్రాన్స్కు తరలించి అక్కడే 18ఏళ్లు వచ్చే వరకూ ఉంచి.. ఆ తర్వాత ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారు ఈ నిందితులు. ఈ కేసులో అరిఫ్ ఫారూకీ అనే కెమెరామెన్, అసిస్టెంట్ కెమెరా మెన్ రాజేష్ షవార్, ఫాతేమా ఫరీధ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టేశారు..
నలుగురు మైనర్లను అక్రమంగా ఫ్రాన్స్కు తరలిస్తున్నారని సమాచారం అందిన వెంటనే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. యువతులను అక్రమ రవాణా చేయడంలో పెద్ద గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు తెలిపారు.
మాయ మాటలతో విదేశాలకు..
పంజాబ్లో ఉన్న ఓ వ్యక్తి.. మైనర్ల తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లలను విదేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంటాడని చెప్పారు. ప్రస్తుతం తాము విడిపించిన మైనర్ పిల్లలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. వారిని బాలల సంక్షేమ గృహానికి తరలించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.