ఒకేసారి పేలిన 1000గ్యాస్ సిలిండర్లు: పరుగుపెట్టిన జనం
కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి-బాగేపల్లి రోడ్డులోని చోకేనహళ్లి గేట్ దగ్గర ఎస్ఎల్ఎన్ గ్యాస్ ఏజెన్సీ గౌడన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు వెయ్యి సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి-బాగేపల్లి రోడ్డులోని చోకేనహళ్లి గేట్ దగ్గర ఎస్ఎల్ఎన్ గ్యాస్ ఏజెన్సీ గౌడన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు వెయ్యి సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనలతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు.
ఈ ఘటనలో మూడు వాహనాలు కూడా పూర్తిగా దహనమయ్యాయి. గ్యాస్ ఎజెన్సీ శివారు ప్రాంతంలో ఉండటం, ప్రమాద సమయంలో సిబ్బంది కూడా లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది.
ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఓ పక్క మంటలు ఆర్పుతుండగానే పేలుళ్లు కొనసాగాయి. అయినప్పటికీ, ఎంతో కష్టపడి దాదాపు ఐదు గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఆదివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. కాగా, ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.