బుల్లెట్ ట్రైన్ కష్టాలు: ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ గుజరాత్ హైకోర్టులో రైతుల పిటిషన్
ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే గతేడాది సెప్టెంబర్లో ముంబై నుంచి అహ్మదాబాద్కు వెళ్లే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించారు. డిసెంబర్,2017లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్ ట్రైన్ను త్వరగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. 2023 ఆగష్టుకల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని తొలుత భావించినా... ఇప్పుడు ఆగష్టు 2022కే పూర్తి చేసి బుల్లెట్ ట్రైన్ను పట్టాలు ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడే కేంద్ర ప్రభుత్వానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఆపండి: రైతులు
ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును త్వరతగతిన పట్టాలు ఎక్కించాలని భావిస్తున్న కేంద్రానికి గుజరాత్ రైతుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు 1000 మంది రైతులు ఈ ప్రాజెక్టును ఆపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రూ.1.08 లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైలు కార్పోరేషన్ లిమిటెడ్ చేపట్టింది. ఇందుకోసం 80శాతం నిధులు జపాన్ తక్కువ వడ్డీకే రుణంగా ఇస్తోంది.
భూసేకరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న గుజరాత్ ప్రభుత్వం
ఇదిలా ఉంటే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు గుజరాత్ మహారాష్ట్రలో కలిపి 1400 హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే భూసేకరణ ప్రారంభించారు. మొత్తం 1400 హెక్టార్ల భూమిలో 1200 హెక్టార్ల భూమి ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తులకు చెందినది. ఎంతలేదన్నా 6వేల మంది భూమి కలిగి ఉన్నవారికి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్ హైకోర్టులో సూరత్కు చెందిన ఐదుగురు రైతులు వేసిన పిటిషన్ను కోర్టు విచారణ చేస్తోంది. తాజాగా 1000 మంద రైతులు కూడా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చేందుకు సిద్దంగా లేమని కోర్టుకు చెప్పారు. అంతేకాదు భూసేకరణ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు రైతులు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఇచ్చిన (జేఐసీఏ)గైడ్లైన్స్ను ప్రభుత్వం పాటిస్తోందని ఆరోపించారు.
చైనా టూ భారత్ బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..?
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టంలో మార్పులు
బుల్లెట్ ప్రాజెక్టు కోసం అంచనా వ్యయం ఒకలా ఉంటే... భూసేకరణ కోసం ప్రభుత్వం చట్టాలనే మారుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమకు తక్కువ పరిహారం చెల్లిస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రకృతి పరమైన అడ్డంకులు, సామాజిక పరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని జేఐసీఏ చెప్పినప్పటికీ ప్రభుత్వం అలాంటి కమిటీ ఏమీ వేయలేదని రైతులు తెలిపారు. అంతేకాదు మొదటి నుంచి మళ్లీ అన్ని తాజాగా చేపట్టాలని జేఐసీఏకు రైతులు లేఖ రాశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో తాము జీవనోపాధి కోల్పోతామని లేఖలో తెలియజేశారు రైతులు. 2013 భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం 2016లో మార్చిందని అదికూడా 2015లో జపాన్తో బుల్లెట్ ట్రెన్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరాకే జరిగిందని రైతులు తెలిపారు. అంతేకాదు భూసేకరణ చేసే సమయంలో తమను ప్రభుత్వం సంప్రదించి తమ అభిప్రాయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు.
రాష్ట్రప్రభుత్వాలు కాకుండా భూములు కేంద్రం కొనుగోలు చేయాలి
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రజాహితం కోసం ఎవరి అభిప్రాయం లేకుండానే సామాజిక అంశాలు దెబ్బతీయకుండా భూసేకరణ చేసేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. అంతేకాదు తమ భూములు మార్కెట్ విలువ ఆధారంగా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే తమ భూములు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ చేస్తే తమకు పరిహారం పరంగా న్యాయం జరగదని చెబుతున్నారు. అదే కేంద్రం తీసుకుంటే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.