ఉపాధి కల్పించమని కోరితే.. లాఠీచార్జీ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు...
కోల్కతా : ఉద్యోగం ఇప్పించాలని ఆందోళన చేపడితే పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటన దీదీ ఇలాకాలో జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇప్పించాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సహా 12 విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హౌరా బ్రిడ్జి నుంచి బెంగాల్ సెక్రటేరియట్ వద్దకు ర్యాలీగా బయల్దేరారు. కానీ వారి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.
ఆందోళన ..
బెంగాల్లోని సింగూర్, హుగ్లీ జిల్లాల నుంచి గురువారం విద్యార్థి సంఘాల నేతల బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడించేందుకు బయల్దేరారు. వీరు హౌరా బ్రిడ్జి గుండా నబానాకు వస్తోన్నారు. అయితే హౌరా బ్రిడ్జి వద్ద పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు. తమకు ఉపాధి కల్పించమని కోరిన విద్యార్థులపై లాఠీలు ఝులిపించారు. విద్యార్థి సంఘ నేతలు అని కూడా చూడలేదు. గొడ్డుల్లా చితకబాదారు.
ఇదీ విషయం ..
విద్యార్థులు సింగూర్ నుంచి తమ ఆందోళన చేపట్టడానికి కూడా ఓ కారణం ఉంది. ఇక్కడ టాటా నానో కార్ల ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు దీదీ సర్కార్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని కూడా నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బెంగాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉపాధి కల్పించమని కోరితే .. లాఠీలు కొడతారేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదీ సరికాదని, ప్రభుత్వ చర్యలను ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని హెచ్చరించారు.
వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే ..
సింగూర్ నుంచి వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీగా బెంగాల్ సచివాలయానికి చేరుకుందామని భావించారు. వేలాదిమంది సచివాలయంలో తమ అభ్యర్థనపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. కానీ పోలీసులు హౌరా వద్ద భారీగా బలగాలను మొహరించారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి మరీ అడ్డుకొన్నారు. బెంగాల్ సచివాలయానికి బయల్దేరిన వారిపై లాఠీ ఝులిపించారు. దీంతో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. మరికొందరు ఉత్సాహం ప్రదర్శించి టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని విద్యార్థులు పేర్కొన్నారు. కానీ సీపీఎం అనుబంధ సంస్థకు చెందిన విద్యార్థి సంఘం తమపై రాళ్ల దాడి చేసిందని .. అందుకోసమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు చెప్తున్నారు.