శ్రీలంక బోటులో పాక్ డ్రగ్స్ అక్రమ రవాణా- 100 కేజీల హెరాయిన్ సీజ్ చేసిన కోస్డ్గార్డ్స్
భారత జలాల్లో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కోసం భారతీయ నౌకాదళం డిసెంబర్ 17 నుంచి తొమ్మిది రోజుల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని తూతుకుడి తీరంలో ఓ అనుమానాస్పద బోటును కోస్ట్గార్డ్స్ స్వాధీనం చేసుకుంది. దీన్ని శ్రీలంకకు చెందినదిగా గుర్తించారు. అయితే ఇందులో ఉన్న అనుమానాస్పద డ్రగ్స్ సంచలనం రేపుతున్నాయి.
తూతుకుడి తీరంలో పట్టుకున్న శ్రీలంక బోటులో ఆరుగురు శ్రీలంక జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో వారు పాకిస్తాన్లోని కరాచీ నుంచి ఓ సెయిలింగ్ బోటు ద్వారా తమ వద్దకు ఈ డ్రగ్స్ చేరాయని, ఇవి ఆస్ట్రేలియా, ఇతర పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీలంక బోటులో మొత్తం 99 ప్యాకెట్ల హెరాయిన్, మరో 20 ప్యాకెట్ల సింథటిక్ డ్రగ్స్, ఐదు 9 ఎంఎం పిస్టల్స్, ఓ శాటిలైట్ ఫోన్ సెట్ దొరికినట్లు కోస్డ్ గార్డ్ వర్గాలు తెలిపాయి. బోటులోని ఓ ఖాళీ చమురు ట్యాంకులో వీటిని దాచి రవాణా చేస్తున్నట్లు వారు తెలిపారు. శ్రీలంక బోటులో దొరికిన వారిని విచారిస్తున్న అధికారులు.. పాకిస్తాన్ జిహాద్నే కాదు డ్రగ్స్ కూడా రవాణా చేస్తోందని వెల్లడించారు.
మరోవైపు బోటులో దొరికిన మాదక ద్రవ్యాలను పరిశీలించిన నార్కోటిక్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇవి పాకిస్తాన్ నుంచి ఎగుమతి అయిన ఆప్ఘన్ డ్రగ్స్గా గుర్తించారు. వీటిని విదేశాలకు రవాణా చేయడం ద్వారా భారీ ఎత్తున సంపాదిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. వీటిలో ఏయే పదార్ధాలు కలిపి విక్రయిస్తున్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలోనూ ఇదే కోవలో డ్రగ్స్ను, వాటి వెనుక ఉన్న వారిని పట్టుకున్న అధికారులు వారికి పాక్కు చెందిన ఉగ్రవాద సంస్ధలు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్తో లింకులున్నట్లు గుర్తించారు.