దేశంలో 102కు చేరిన యూకే స్ట్రెయిన్ కరోనావైరస్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్త రకం కరోనా(యూకే స్ట్రెయిన్) కేసుల సంఖ్య 102కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. జనవరి 11న 96 ఉండగా, బుధవారానికి 102కు చేరింది. పాజిటివ్ వచ్చిన వారందర్నీ ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గదిలో ఐసోలేషన్లో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్లో ఉంచారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారితో సహా ప్రయాణికులు, వారిని కలిసిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వీరి నమూనాలపై జన్యు పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని చాలా కీలంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. దీనిపై పర్యవేక్షణ, టెస్టులు చేయడం, నమూనాలను ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సోర్టియం ల్యాబులకు పంపడంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తుందని కేంద్రం పేర్కొంది.
భారతదేశంలోనే కాకుండా ఈ యూకే స్ట్రెయిన్ కరోనావైరస్ డెన్కార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాలకు కూడా వ్యాపించింది. సాధారణ కరోనా వైరస్ కంటే త్వరితగంగా వ్యాప్తి చెందే ఈ యూకే స్త్రెయిన్ పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు యూకే విమానాలను రద్దు చేశాయి.
ఇది ఇలావుండగా, సాధారణ కరోనావైరస్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటలల్లో దేశ వ్యాప్తంగా 8,36,227 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 1,01,29,111 మంది కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 17,817 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 202 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,51,529కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,507 యాక్టివ్ కేసులు ఉన్నాయి.