102 మంది కాదు కాదు 254 మంది: భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాతో మృతిపై గందరగోళం..
భోపాల్ గ్యాస్ దుర్గఘన గురించి చెబితే ఒళ్లు జలదరిస్తోంది. 1984లో జరిగిన ఘటనలో వేలాది మంది చనిపోయారు. ఆ ఘటన నుంచి కొందరు కోలుకున్నారు. అయితే వారు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. కానీ వారిలో కొందరినీ చివరికీ కరోనా వైరస్ కబళించింది. అవును భోపాల్ గ్యాస్ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ కొందరినీ కరోనా వైరస్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ధృవీకరించింది.
36 ఏళ్ల కింద..
భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2వ తేదీన జరిగింది. నిన్నటితో 36 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఆనాటి ఘటన నుంచి బయటపడ్డ 102 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. కానీ ఓ స్వచ్చంద సంస్థ మాత్రం 254 మంది వరకు చనిపోయారని తెలిపిందని పీటీఐ రిపోర్ట్ చేసింది. ఈ రెండింటీ మధ్య తేడా దాదాపు 150కి పైగా సంఖ్య తేడా ఉండటం విశేషం.
గాలిలో కలిసిన ప్రాణాలు
డిసెంబర్ 2వ తేదీ రాత్రి భోపాల్లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన పురుగుమందుల ప్లాంట్ నుంచి మిథౌల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకయ్యింది. దీంతో 15 వేలకు పైగా మంది చనిపోయారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపింది. ఇదీ ప్రపంచంలోనే ఘోరమైన గ్యాస్ లీకేజీగా మిగిలిపోయింది.
518 మృతి.. వీరిలో....
ఈ నెల 2వ తేదీ వరకు భోపాల్ జిల్లాలో కరోనా వైరస్తో 518 మంది చనిపోయారు. వీరిలో 102 మంది భోపాల్ గ్యాస్ ఘటన నుంచి కోలుకున్నవారు అని తెలిపింది. వీరిలో 69 మంది 50 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. 50 ఏళ్ల లోపు 33 మంది ఉన్నారు. అయితే భోపాల్ గ్రూపు ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్కి చెందిన ఎన్జీవో సంస్థ మాత్రం చనిపోయిన వారి సంఖ్య ఎక్కువే అని చెబుతోంది. 518లో 450 మంది ఇళ్లను పరిశీలించామని ఎన్జీవో ప్రతినిధి రచన ధింగ్రా తెలిపారు. వీరిలో 250 మంది భోపాల్ గ్యాస్లో బతికి బయటపడ్డవారేనని చెప్పారు.
Recommended Video
254 మందికి స్మార్ట్ కార్డులు కూడా..
254 మందికి భోపాల్ మోమెరియల్ ఆస్పత్రి స్మార్ట్ కార్డు జారీచేసిందని ఆమె తెలిపారు. వారికి భోపాల్ గ్యాస్ ఘటనకు సంబంధించి పరిహారం కూడా అందిందని తెలిపారు. తాము ఇప్పటికే స్మార్ట్ కార్డు కూడా కలెక్ట్ చేశామని వివరించారు. వీటిని చీఫ్ మెడికల్ ఆఫీసర్కు అందజేశామని కూడా చెప్పారు. భోపాల్ గ్యాస్ ఘటన నుంచి కోలుకున్నవారికి సంబంధించి ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదు అని వెల్లడించింది.