4వ తరగతి పరీక్ష రాసిన 105 సంవత్సరాల బామ్మ..! అందుకే అక్కడ వందశాతం అక్షరాస్యత
తిరువనంతపురం: దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ ఒక్కటే. ఆ రాష్ట్రంలో నూటికి నూరుమందీ అక్షరాస్యులే. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మాలయాళీలకు చదువుకోవడం ఉన్న శ్రద్ధాసక్తులు కేరళను అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలిపుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. 105 సంవత్సరాలు నిండిన వయోధిక వృద్ధురాలు ఒకరు బుధవారం నాలుగవ తరగతికి తత్సమానమైన పరీక్షను రాశారు.
ఆమె పేరు భగీరథి అమ్మ. కేరళలోని కొల్లంలో నివసిస్తున్నారు. ఈ ఉదయం ఆమె నాలుగవ తరగతికి తత్సమానమైన పరీక్షను రాశారు. కేరళ అక్షరాస్యత మిషన్ లో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలను నిర్వహించింది. భగీరథి అమ్మ వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్షరాస్యత మిషన్ అధికారులు ఆమెకు పరీక్షా కేంద్రానికి రాకుండా మినహాయింపును ఇచ్చారు. ఇంటి వద్దే పరీక్ష రాసే వెసలుబాటును కల్పించారు.
అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ పీఎస్ శ్రీకళ, రిసోర్స్ పర్సన్ వసంత్ కుమార్ ప్రశ్నాపత్రాలను కొల్లంలోని భగీరథి అమ్మ ఇంటికే తీసుకొని వచ్చారు. వారి సమక్షంలోనే పరీక్ష రాశారు. జవాబు పత్రాలను పొందికగా కట్టు కట్టి వారి చేతికి అందజేశారు. పరీక్ష రాయడానికి ఆమె ఎవరి సహాయాన్ని కూడా తీసుకోలేదు. కంటి అద్దాలను కూడా వాడలేదు. తనకు కళ్లు బాగా కనిపిస్తాయని, అందుకే కళ్లద్దాలను వాడాల్సిన అవసరం రాలేదని భగీరథి అమ్మ చెప్పారు.
Recommended Video
చిన్న వయస్సులోనే భగీరథి అమ్మకు వివాహమైంది. ఆమెకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారికి కూడా మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. 30 సంవత్సరాల వయస్సులోనే భర్తను కోల్పోయారు. ఫలితంగా కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చిందని, అందుకే తనకు ఆసక్తి ఉన్నప్పటికీ.. చదువు కోలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం తనకు ఎలాంటి బాదరబందీ లేదని, అందుకే ఇష్టం వచ్చినన్ని రోజులు చదువుకుంటానని అన్నారు. తొమ్మిదేళ్ల వయస్సులో మూడో తరగతితో ఆపి వేసినప్పటికీ.. తన పిల్లలకు మాత్రం ఉన్నత చదువులను చదివించారామె.