ఓటు వేసిన 105 ఏళ్ల వృద్దురాలు, యువతకు ఆదర్శం: భారీ వర్షాలు, అభ్యర్థుల గుండెల్లో గుబులు!
బెంగళూరు: ఓటు వెయ్యాలనే ఆశ ఉంటే అందుకు వయసు అడ్డురాదని ఓ వృద్దురాలు నిరూపించారు. 105 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్ కేంధానికి చేరుకున్న ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. భారీ వర్షాల కారణంగా ఓటర్లు బయటకురాకపోవడంతో పలు పార్టీల అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది.
దక్షిణ కన్నడ జిల్లా
దక్షిణ కన్నడ జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతోంది. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు సమీపంలోని అరియడ్క ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐశుమ్మ (105) శనివారం కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
రాష్ట్రంలో భాగం
కర్ణాటక రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఐశుమ్మ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారని, ఇలాంటి వారు నేటి యువతకు ఆదర్శమని, ఎలాంటి సందర్బంలో ఓటు హక్కును వినియోగించుకోకుండా దుర్వినియోగం చెయ్యకూడదని ఆమె చాటి చెప్పారని స్థానికులు అభినందించారు.
భారీ వర్షాలు
హుబ్బళి-ధారవాడలో భారీ వర్షాలు మొదలైనాయి. శనివారం మద్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం అయిన భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా పడుతున్నాయి. హుబ్బళి-ధారవాడలో శనివారం మద్యాహ్నం మూడు గంటలకు ఓటు వేసిన స్థానికులు తరువాత బయటకు రావాలంటే మిగిలిన వారు హడలిపోతున్నారు.
అభ్యర్థుల గుండెల్లో గుబులు
భారీ వర్షాల కారణంగా హుబ్బళి-ధారవాడ తూర్పు, హుబ్బళి-ధారవాడ సెంట్రల్, హుబ్బళి-ధారవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కడ ఓటింగ్ శాతం తగ్గిపోతుందో అని ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ (బీజేపీ) ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.