అరుదైన కేసు... స్పానిష్ ఫ్లూ నాటికి నాలుగేళ్లు... కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్దుడు..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఎటు చూసినా ఆందోళనకర పరిస్థితులే. ఎక్కడ ఏ ఇద్దరు మాట్లాడుకున్నా... ఏ టీవీ చానెల్ పెట్టినా... అంతా కరోనా గురించే. యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తున్నవేళ.. ఇప్పుడు చెప్పుకోబోయే వార్త కరోనా టెన్షన్స్ నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చేదే అని చెప్పాలి. ఢిల్లీకి చెందిన 106 ఏళ్ల ఓ వృద్దుడు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అంత వృద్దాప్యంలోనూ ఆయన కరోనాను జయించడం మిగతా కరోనా పేషెంట్లకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చేదిగా మారింది.
కొడుకు కంటే వేగంగా కోలుకున్న వృద్దుడు...
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి ఇటీవలే ఆ వృద్దుడు డిశ్చార్జి అయ్యారు. ఆశ్చర్యకర విషయమేంటంటే... 70 ఏళ్ల వయసున్న కొడుకు కంటే 106 ఏళ్ల వయసున్న ఆయనే త్వరగా వైరస్ నుంచి కోలుకున్నారు. 1918లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని వణికించిన సమయంలో ఆ వృద్దుడికి నాలుగేళ్లు. ఢిల్లీలో స్పానిష్ ఫ్లూ కాలానికి చెందిన వ్యక్తి కరోనాను జయించి డిశ్చార్జి అయిన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం.
వైద్యులు ఏమంటున్నారు...
'ఆ వృద్దుడికి అప్పట్లో స్పానిష్ ఫ్లూ సోకిందో లేదో తెలియదు. ఆ కాలంలో ఢిల్లీలో అతికొద్ది ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. ఏదేమైనా 106 ఏళ్ల వృద్దుడు కరోనాను జయించడం అద్భుతం.రెండు ప్రాణాంతక వైరస్లు ఉద్భవించిన కాలాలను ఆయన కళ్లారా చూశారు.' అని ఓ సీనియర్ వైద్యుడు పేర్కొన్నారు. ఇప్పటివరకూ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెయ్యి మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందించారు. దీన్నొక మైల్ స్టోన్గా భావిస్తూ ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
కరోనా కంటే డేంజర్.. స్పానిష్ ఫ్లూ
సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ (CDC) ప్రకారం... చరిత్రలో 1918 ఇన్ఫ్లుయెంజా(స్పానిష్ ఫ్లూ) అత్యంత ప్రాణాంతక మహమ్మారిగా నిలిచిపోయింది. H1N1 అనే వైరస్ ద్వారా ఇది వ్యాప్తి చెందింది. అయితే ఈ వైరస్ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందనే దానికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు,ఏకాభిప్రాయం లేదు. 1918-1919 ప్రాంతంలో ఈ వైరస్ ప్రపంచం మొత్తానికి పాకింది. వైరస్ సోకి ప్రపంచవ్యాప్తంగా 40 మిలియయన్ల మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. ఇందులో ఒక్క భారత్లోనే 14 మిలియన్ల మంది చనిపోయారన్న వాదన కూడా ఉంది,
Recommended Video
త్వరలో రష్యాను దాటే ఛాన్స్...
ఆదివారం(జూలై 5) నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,453కి చేరింది. ఇప్పటివరకూ 19,303 మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాకు భారత్ కాస్త అటు ఇటుగా కేవలం 14వేల కేసుల దూరంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే... త్వరలోనే రష్యాను భారత్ అధిగమిస్తుంది. ప్రస్తుతం అమెరికా 29,36,890 కేసులతో అగ్ర స్థానంలో ఉండగా.. బ్రెజిల్ 15,78,376 కేసులు,రష్యా 6,81,251 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.