యమునోత్రి హైవేపై చిక్కుకున్న 10 వేల మంది జనం-రక్షణ గోడ కూలి రోడ్డు బ్లాక్ కావడంతో
ఉత్తరాఖండ్ లోని యమనోత్రి రహదారిపై కొండచరియలు పడకుండా నిర్మించిన రక్షణ గోడ కూలిన ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 10 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ రహదారిపై చిక్కుకుపోయారు. కూలిన రక్షణ గోడ తొలగిస్తే కానీ వారిని కాపాడలేని పరిస్ధితులు నెలకొన్నాయి.దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
యమునోత్రి ఆలయానికి వెళ్లే హైవే భద్రతా గోడ కూలిపోవడంతో దాదాపు 10,000 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. దీని కారణంగా, రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే ఈ 10,000 మంది ప్రజలు హైవే వెంబడి వివిధ ప్రదేశాలలో చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యల తర్వాత ఈ రహదారి మళ్లీ తెరవడానికి 3 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తునారు. జిల్లా యంత్రాంగం కొన్ని చిన్న వాహనాల నుంచి ప్రయాణికులను తరలించేందుకు యత్నిస్తుండగా దూరప్రాంతాల నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన వారు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
యమునోత్రి ఆలయానికి వెళ్లేందుకు బయలుదేరిన ప్రయాణికులే ఇందులో పెద్ద మొత్తంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వీరంతా ఆలయానికి వెళ్తుండగా యమునోత్రి హైవేపై రక్షణ గోడ కూలిపోయింది. దీంతో దర్శనానికి సైతం వెళ్లలేని పరిస్ధితుల్లో చాలా మంది రహదారిపై చిక్కుపోయారు. వీరిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నా అక్కడ ప్రతికూల పరిస్ధితులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలు కూడా వేగంగా చేపట్టలేని పరిస్ధితి ఉంది. రక్షణ గోడ శిధిలాల తొలగింపు పూర్తయితే కానీ యాత్రికుల వాహనాలు వెళ్లలేని పరిస్ధితి.