ప్రాణం మీదికి తెచ్చిన 10కె రన్: ఒకరి మృతి: పలువురు ఆసుపత్రిపాలు.. పరిస్థితి విషమం..!
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ముంబైలో ఉత్సాహంగా నిర్వహించిన 10కె రన్ హాఫ్ మారథాన్..విషాదాంతానికి దారి తీసింది. ఇందులో పాల్గొన్న ఓ వయోధిక వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ఇదే కారణంతో మరో ఏడుమంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారందర్నీ బోంబే ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.
మృతుడిని గజానన్ మల్జల్కర్గా గుర్తించారు. 64 సంవత్సరాల వయస్సున్న గజానన్.. ముంబైకి చెందిన వారే. ఈ ఉదయం నిర్వహించిన 10కె రన్లో ఆయన పాల్గొన్నారు. 10కె రన్ హాఫ్ మారథాన్ ఆరంభమైన తరువాత సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఆయన ఏకధాటిగా పరుగెత్తారు. అనంతరం కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను బోంబే ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూశారు. ఇదే 10కె రన్లో మరో ఏడుమంది గుండెనొప్పికి గురయ్యారు.
వారిని కూడా సకాలంలో బోంబే ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాలకు ప్రఖ్యాత ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) వద్ద 10కె రన్ హాఫ్ మారథాన్ ఆరంభమైంది. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే దీన్ని ప్రారంభించారు.
సుమారు 55 వేల మంది ఇందులో పాల్గొన్నారు. 10కె రన్, హాఫ్ మారథాన్గా విభజించారు. పలువురు విదేశీయులు సైతం పాల్గొన్న ఈ ఈవెంట్ సీఎస్టీ నుంచి బాంద్రా-వర్లీ సీలింక్, మెరైన్ డ్రైవ్, మహాలక్ష్మీ రేస్కోర్స్, హాజీ అలీ, పొద్దర్ రోడ్ల మీదుగా ఈ హాఫ్ మారథాన్ కొనసాగాల్సి ఉంది. అంతలోపే ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన ఏడుమందికి చికిత్స అందిస్తున్నామని బోంబే ఆసుపత్రి పీఆర్వో బులెటిన్లో వెల్లడించారు.