రైతు సంఘాలతో కేంద్రం 10వ దఫా చర్చలు వాయిదా: జనవరి 19కి బదులు 20న భేటీ
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జనవరి 19న(మంగళవారం) జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. జనవరి 20న చర్చలు జరుపుతామంటూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ రైతు సంఘాలకు సమాచారం పంపింది.
జనవరి 20న మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలు జరగనున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు 54 రోజులుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధులతో 9 దఫాలుగా చర్చలు జరిపింది. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. రైతు చట్టాలను రద్దు చేసేదాక ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసన విరమింపజేసేది లేదంటూ రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదంటూ స్పష్టం చేసింది. వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మిగితా ఏమైనా అడగండి అని రైతు సంఘాల ప్రతినిధులను ఇప్పటికే కేంద్రం కోరింది.
ఇది ఇలావుండగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేగాక, సమస్య పరిష్కారానికి నలుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ కమిటీ తొలి సమావేశం నిర్వహించనుంది.