11.30-4.30.. అప్పుడు చనిపోలేదు: జయలలిత మృతిపై పన్నీరుసెల్వం బాంబు
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను టార్గెట్గా పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బుధవారం నాడు బాంబు పేల్చారు. అందరూ ఊహించినట్లుగా ఆయన షాకింగ్ విషయం చెప్పారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను టార్గెట్గా పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బుధవారం నాడు బాంబు పేల్చారు. అందరూ ఊహించినట్లుగా ఆయన షాకింగ్ విషయం చెప్పారు.
జయలలిత కేసు మిస్టరీని చేధించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఒక్కరోజు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం మాట్లాడారు. జయలలిత మృతి చెందిన విషయం తనకు డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం గం.6.30కు తెలిసిందని బాంబు పేల్చారు.
జయలలిత ఆరోగ్యం విషయమై అన్నింటిని ఎప్పటికప్పుడు పన్నీరు సెల్వం, ఇతర అధికారులకు తెలిపినట్లు రెండు రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ ప్రకటనలో విపక్షాలు సహా పలువురు ఎన్నో ప్రశ్నలను, అనుమానాలను లేవనెత్తారు. ఇప్పుడు పన్నీరు మరో విషయం చెప్పారు. దీంతో ప్రభుత్వం అబద్దం ఆడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బాంబు పేల్చిన పన్నీరు సెల్వం
ఇప్పుడు, పన్నీరు సెల్వం మరో షాకింగ్ చెప్పారు. డిసెంబర్ 5న సాయంత్రం ఆరున్నర గంటలకే తనకు జయలలిత మృతి చెందిన విషయం తెలుసునని చెప్పారు. అలాగే, సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను తప్పుబట్టారు.
ఆసుపత్రి వర్గాలు ఇలా..
అపోలో ఆసుపత్రి విడుదల చేసిన ప్రెస్ నోట్లో 5 డిసెంబర్ 2016 రాత్రి గం.11.30 నిమిషాలకు జయలలిత చనిపోయినట్లుగా ఉంది. పన్నీరు సెల్వం మాత్రం తనకు ఆరున్నర గంటలకే తెలుసునని చెప్పారు.
డిసెంబర్ 5న గం.4.30కే మృతి
ఈ సందర్భంగా మరో విషయం కూడా చెప్పారు. జయలలిత ఆ రోజు సాయంత్రం గం.4.30 నిమిషాలకే చనిపోయినట్లుగా తెలిసిందని వ్యాఖ్యానించారు. కానీ తనకు రెండు గంటలు ఆలస్యంగా.. అంటే ఆరున్నరకు చెప్పారన్నారు. కాగా, ఇప్పటికే ప్రతిపక్ష నేత స్టాలిన్, మరో నేత రాందాస్ 'అమ్మ' మృతిపై అనుమానాలు లేవనెత్తారు.
పన్నీరు నిరాహార దీక్ష
జయలలిత మృతిపై న్యాయ, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పన్నీరుసెల్వం బుధవారం ఉదయం చెన్నైలో నిరాహారదీక్ష దిగిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు ఆయన వర్గ పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపట్టారు.
ఒక్కరోజు దీక్ష
జయలలిత మరణానంతరం శశకళ వర్గం నుంచి బయటకు వచ్చిన పన్నీరుసెల్వం ఆమెపై తవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఆయన రాష్ట్రవ్యాప్త మద్దతును కూడగడుతున్నారు. తదనుగుణంగా జయ మృతిపై అనుమానాలను లేవనెత్త మృతిపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన వర్గీయులతో స్థానిక చెన్నైలోని రాజారత్నం స్టేడియంలో నిరాహారదీక్ష చేపట్టారు.