కల్తీ మద్యం సేవించి 11 మంది మృతి - మరో 8మందికి తీవ్ర అస్వస్థత -మంత్రి కీలక ఆదేశాలు
దేశంలో కల్తీ మద్యం మాఫియాకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కల్తీ మద్యం కాటుకు జనం బలైపోతున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ ఏలుబడిలోని హిందీ రాష్ట్రాల్లో ఇల్లీగల్ లిక్కర్ దందా తారాస్థాయికి చేరిందనడానికి నిదర్శనంగా వరుస సంఘటలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట ఉత్తరప్రదేశ్ లో, తాజాగా మంగళవారం నాడు మధ్యప్రదేశ్ లో విషాదాలు చోటుచేసుకున్నాయి..
మధ్యప్రదేశ్, మోరీనా జిల్లాలోని మాన్ పూర్, పహావాలి అనే గ్రామాల్లో కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. దాన్ని సేవించినవారిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతోన్నవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు ప్రస్తుతం గ్వాలియర్లోని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత అక్టోబరులోనూ కల్తీ మద్యం తాగి 15 మంది కూలీలు చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోనే చోటుచేసుకుంది. కాగా,
మెరీనా జిల్లాలోని మన్ పూర్, పహావాలి గ్రామాల్లో కల్తీ మద్యం మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా అక్కడ కల్తీ మద్యం అమ్మకాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా, విక్రయాలను ఆపడంలో విఫలమై, ప్రజల చావులకు కారకుడయ్యారంటూ స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసరును మంత్రి సస్పెండ్ చేశారు. అయితే,
రాష్ట్రంలో కల్తీ మద్యం మాఫియాకు కొందరు రాజకీయ నేతల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. మెరీనా జిల్లా ఘటనపై ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. తొలుద మరణాలకు కారణం విషపూరిత మద్యమేనని ప్రచారం జరగ్గా, మద్యంలో విషం లేదని, మరణాలకు కారణాలు త్వరలోనే వెల్లడవుతాయని ఐజీపీ మనోజ్ శర్మ మీడియాకు చెప్పారు.
నాలుగు రోజుల కిందట ఉత్తర్ప్రదేశ్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందగా, 16 మంది ఆసుపత్రి పాలయ్యారు. బులంద్షహర్ జిల్లా జీత్గఢీ గ్రామంలోని ఓ బెల్టు షాపు నుంచి కొన్న మద్యంలో కల్తీ ఏర్పడటంతో ఈ ఘటన జరిగింది. జీత్ గఢ్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారుల్ని మందలించారు. అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నప్పటికీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు సీనియర్ ఎక్సైజ్ అధికారులను పదవుల నుంచి తొలగించారు.