షాకింగ్: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు: ప్రాణాలతో ఒకే ఒక్కడు: అసలు ట్విస్ట్ అదే
జోధ్పూర్: షాకింగ్.. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంతం ఇది. వారి మృతదేహాలు ఊరి చివరన ఉన్న ఓ పొలంలో లభించాయి. ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన కొందరు కూలీలు ఈ మృతదేహాలను చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఆ కుటుంబంలో మిగిలిన ఉన్న ఒకే ఒక్కడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు.
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులుగా గుర్తించారు. 2012లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వారంతా జోధ్పూర్ సమీపంలోని గ్రామంలో నివసిస్తున్నారు. వ్యవసాయ పనులను చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. భారత పౌరసత్వానికి ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో వారు అనుమానాస్పద స్థితిలో నిర్జీవంగా కనిపించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ కుటుంబంలో ఒకే ఒక్కరు ప్రాణాలతో మిగిలి ఉన్నాడు. దేచు పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు.
మృతులందరూ ఇదివరకు పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ లో నివసించే వారని, 2012లో వారంతా శరణార్థులుగా భారత్కు వలస వచ్చారని పోలీసులు వెల్లడించారు. మూకుమ్మడిగా వారంతా మరణించడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని తెలిపారు. వారంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అనేది తమ దర్యాప్తులో తేలుతుందని అన్నారు. వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారత పౌరసత్వం ఇంకా లభించకపోవడం వల్ల వారికి ఎలాంటి సౌకర్యాలు అందట్లేదని చెబుతున్నారు.
Recommended Video
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్డౌన్ తరువాత ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయని, ఫలితంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విష వాయువులను పీల్చడం వల్ల వారంతా మరణించారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు దేచు పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ హనుమాన్ రామ్ తెలిపారు. ఆ కుటుంబంలో ఒకరు మాత్రమే ప్రాణాలతో ఎలా జీవించి ఉన్నాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని ఆ సమయంలో అతను ఇంట్లో ఉండకపోవచ్చని చెబుతున్నారు.