జార్ఖండ్: ఆలయంలో తొక్కిసలాట, 11మంది మృతి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని దియోగఢ్లోని దుర్గామాత ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచి దర్శనానికి అనుమతి ఇవ్వడంతో భక్తులంతా ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకుంది.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే భక్తుల ప్రాణాలు తీసిందని మండిపడ్డారు.మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట విషయాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబార్దాస్ను అడిగి మోడీ తెలుసుకున్నారు.
కాగా, మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబార్దాస్ సంతాపం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఒక్కో క్షతగాత్రుడికి రూ. 50,000 ఇస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు.