జమ్ము కశ్మీర్లో లోయలో పడ్డ బస్సు...11 మంది మృతి
పూంచ్ : జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూంచ్ జిల్లాల్లో ఓ బస్సు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. లోరన్ నుంచి పూంచ్కు ప్రయాణికులను తీసుకెళుతున్న బస్సు ప్లేరా వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఇదిలా ఉంటే డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం సంభవించిందని పోలీసులు చెప్పారు. బస్సు లోయలోకి పడిపోవడంతో నుజ్జు నుజ్జు అయ్యిందని లోయలో ప్రవహిస్తున్న నది తీరం వద్ద పడిపోయిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం మండిలోని జిల్లా హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు.
జమ్మూ కశ్మీర్లో బస్సులు తరుచూ లోయలో పడుతున్నాయని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. బస్సులో సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రజాసంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బస్సు కండిషన్ కూడా సరిగ్గా ఉండకపోవడంతో ప్రమాదాలు తరుచూ సంభవిస్తున్నాయని మరికొన్ని ఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోందని చెప్పారు.