ఆమ్ ఆద్మీ క్యాంపెయిన్.. 24గంటల్లో 11 లక్షల మంది.. కేజ్రీవాల్ క్రేజ్ మామూలుగా లేదుగా..
వరుసగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఫుల్ బూస్టింగ్ ఇచ్చింది. ఎంతలా అంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 11 లక్షల మంది ఆ పార్టీ తలపెట్టిన నేషన్ బిల్డింగ్ క్యాంపెయిన్లో భాగస్వాములయ్యారు. పార్టీ సూచించిన 9871010101కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వీరంతా క్యాంపెయిన్లో చేరారు. పార్టీ క్యాంపెయిన్కు ఇంత భారీ ఎత్తున స్పందన రావడం చారిత్రాత్మకం అని ఆమ్ ఆద్మీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాగా,ఎన్నికలు ఫలితాలు వెలువడ్డ మరుసటిరోజు మంగళవారం ఆమ్ ఆద్మీ తమ క్యాంపెయిన్కు సంబంధించిన మిస్డ్ కాల్ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు మీడియా సంస్థల ద్వారా ఈ నంబర్ ప్రజల్లోకి వెళ్లింది. అనూహ్యంగా 24గంటల్లోనే 11 లక్షల మందిని క్యాంపెయిన్లో భాగస్వాములు అయ్యేలా చేసింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 62 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అసలు ఖాతా కూడా తెరవలేదు. వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాలే చేజిక్కించుకున్నారు.
Recommended Video
ఈనెల 16వ తేదీ ఉదయం ఢిల్లీలోని రామలీలా మైదాన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లాంఛనంగా అసెంబ్లీని రద్దు చేశారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమై కేజ్రీవాల్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతారు. ఆ తర్వాత కేజ్రీ సీఎం పదవికి లాంఛనంగా రాజీనామా చేస్తారు. ఇదిలా ఉంటే,కేజ్రీవాల్ ఫిబ్రవరి 14నే ప్రమాణస్వీకారం చేస్తారని చాలామంది భావించారు. 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఫ్రిబవరి 14నే ఆయన రాజీనామా చేశారు. అనంతరం 2105లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈసారి కూడా సెంటిమెంటుగా అదేరోజు ప్రమాణస్వీకారం చేస్తారని చాలామంది భావించినప్పటికీ.. కేజ్రీ మాత్రం ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు.