అంతర్గత కుమ్ములాటతో గిర్ అడవుల్లో 10 రోజుల్లో 11 సింహాలు మృతి!
Recommended Video
అహ్మదాబాద్: గుజరాత్ సౌరాష్ట్రలోని గిర్ అభయారణ్యంలో కేవలం పది రోజుల్లో 11 సింహాలు మృతి చెందడం అటవీ అధికారులను ఆందోళకు గురి చేస్తోంది. చనిపోయిన దాదాపు ఈ సింహాలు అన్ని కూడా దల్కానియా రేంజ్కు చెందినవి.
సమాచారం మేరకు, ఇందులో ఎనిమిది సింహాలు అంటురోగాల కారణంగా చనిపోయాయి. ఇందులో ఒకటి ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయింది. మూడు సింహాలు అంతర్గత సంఘర్షణ కారణంగా చనిపోయాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
గిర్ పారెస్ట్లో తాము 11 విగతజీవులుగా ఉన్న సింహాలను గుర్తించామని గిర్ (ఈస్ట్) ఫారెస్ట్ డిప్యూటీ కన్సర్వేటర్ పురుషోత్తం తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ కోసం గిర్ ఫారెస్ట్ను, ఈస్ట్, వెస్ట్లుగా విభజించారు.
అమ్రేలి జిల్లాలోని రాజులా సమీపంలోని అడవుల్లో సింహాలు బుధవారం విగతజీవులుగా కనిపించాయి. అదే రోజు మరో మూడు సింహాలు కూడా దల్కనియా రేంజ్లో కనిపించాయి.
వాటి అవశేషాలను సేకరించి జునాగఢ్ వెటర్నిటీ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించామని అధికారులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.
ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్టుమెంట్ అడిషనల్ సెక్రటరీ రాజీవ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పలు సింహాలు అంతర్గత కలహం కారణంగా చనిపోయాయని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పిల్లలు, ఆడ సింహాలు ఉన్నాయని తెలిపారు. 2015 లెక్క ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి.