పుణ్యక్షేత్రం సమీపంలో రోడ్డు ప్రమాదం: సంఘటనా స్థలంలో 11 మంది మృతి, ఆషాడ పాడ్యమి!
బెంగళూరు: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా, చింతామణి తాలుకాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మురుగమల్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. అనేక మందికి తీవ్రగాయాలు కావడంతో చింతామణిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.
బుధవారం ప్రముఖ పుణ్యక్షేత్రం మురగమల్ల నుంచి ప్రైవేటు బస్సు చింతామణి వైపు బయలుదేరింది. చింతామణి పట్టణం నుంచి టాటా ఏస్ వాహనం (గూడ్స్) మురుగమల్లకు ప్రయాణికులతో బయలుదేరింది. మురగమల్ల సమీపిస్తున్న సమయంలో ప్రైవేటు బస్సు. టాటా ఏస్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో 11 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. విషయం గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి చింతామణి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలైన వారిని చింతామణిలోని ఆసుపత్రులకు తరలించారు.
కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతోవారిని బెంగళూరులోని ఆసుపత్రలకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రక్తసిక్థం అయ్యింది. నిత్యం ప్రైవేటు బస్సులు, ఆటోల్లో మురగమల్లకు భక్తులు, పరిసర ప్రాంతాల గ్రామలస్తులు సంచరిస్తుంటారు. వాహనాలు విచ్చలవిడిగా నడుపుతున్నారని, అందుకే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్థానికులు గుమికూడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.