జైలులో ఖైదీల గొడవ.. 11 మందికి గాయాలు.. వింత ప్రవర్తన అన్న అధికారులు
తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున కొందరు ఖైదీలు గొడవ పడినట్లు, ఈ గొడవలో 11 మంది ఖైదీలకు గాయాలైనట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: తీహార్ జైలులో కొందరు ఖైదీలు గొడవ పడినట్లు, ఈ గొడవలో 11 మంది ఖైదీలకు గాయాలైనట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గాయపడిన ఖైదీలను జైలు సిబ్బంది హుటాహుటిన సమీపంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఖైదీలు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని సమాచారం. అయితే ఈ ఘటన గురించి జైళ్ల విభాగం డీజీ సుదీర్ యాదవ్ చెప్పింది మరో రకంగా ఉంది.
స్పెషల్ సెక్యూరిటీ సెల్ లో ఉన్న ఖైదీల్లో తొలుత ఒక ఖైదీ సెక్యూరిటీ గార్డును పిలిచి తనకు ఒంట్లో బాగోలేదని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరాడని, దీంతో సిబ్బంది సెల్ తాళం చెవులు తీసుకుని వచ్చారని.. అదే సమయంలో మిగిలిన ఖైదీలు కూడా తమకూ ఒంట్లో బాగోలేదని తమను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారని ఆయన తెలిపారు.
అందరినీ ఒకేసారి సెల్ బయటికి తీసుకొస్తే భద్రతా పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున జైలు సిబ్బంది అందుకు ఒప్పుకోలేదని, దీంతో ఖైదీలు ఎవరికి వారే వారి తలలు గోడకేసి కొట్టుకోవడం మొదలెట్టారని, దీంతో 11 మందికి గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు.
జైళ్ల విభాగం డీజీ సుదీర్ యాదవ్ చెప్పింది నిజమా? లేక ఖైదీలు వారిలో వారే తగవు పడి గాయపడ్డారా? అనే దానిపై ఇంకా స్పష్టత రావలసి ఉంది. గత జనవరిలో కూడా ఇలాగే వినాయక్ కర్బాత్ కర్ అనే గ్యాంగ్ స్టర్ మరో 48 మంది సహ ఖైదీలతో కలిసి సదా సబ్ జైలు సెక్యూరిటీ సిబ్బందిపై తిరగబడిన సంగతి తెలిసిందే.
జైలు నుంచి తప్పించుకునేందుకు మూకుమ్మడిగా ప్రయత్నించిన ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి, ఖైదీలకు మధ్య పోరాటం జరిగింది. ఆ ఘటనలో కొంతమంది ఖైదీలు ఇలాగే గాయపడ్డారు. ఇప్పుడు తీహార్ జైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగిందా? నిజాన్ని అధికారులు దాచి పెట్టారా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.