లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో 11 ఏళ్ళ బాలుడు, ఎక్కడంటే?
మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తనను కలిసేందుకు వచ్చిన 11 ఏళ్ళ బాలుడిని తన కుర్చీలోనే కూర్చోబెట్టారు.కిరణ్బేడీ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతున్నారు.
పుదుచ్చేరి: మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తనను కలిసేందుకు వచ్చిన 11 ఏళ్ళ బాలుడిని తన కుర్చీలోనే కూర్చోబెట్టారు.కిరణ్బేడీ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.
తనను కలిసేందుకు వచ్చిన ఓ బాలుడికి అప్యాయ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా గవర్నర్ కుర్చీలోనే అతన్ని కూర్చోబెట్టారు.రాజ్ నివాస్కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉంది. శనివారం ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులతో వెళ్లి ఆమెను కలిశారు. వారితో కాసేపు మాట్లాడారు కిరణ్బేడీ.
బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు.
ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతానని ఆమె ట్విట్టర్లో తెలిపారు. ''ఏమో దీనిని స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే ఈ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?''అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు.