దారుణం: 11ఏళ్ల బాలికను రేప్ చేసి హత్య చేశారు
గుర్గావ్: హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ దారుణం జరిగింది. ఓ 11ఏళ్ల బాలికను అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గుర్గావ్లోని సెక్టార్ 27లోని ఓ ఖాళీ ప్లాట్లో చోటు చేసుకుంది. అర్ధనగ్నంగా ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి తల్లిదండ్రులు దుస్తులు ఉతికే పని చేసుకుంటూ జీవిస్తున్నారు. బాధిత బాలిక ఇతరుల ఇళ్లకు వెళ్లి దుస్తులను తెచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పడం.. వాటిని ఉతికి, ఇస్త్రీ చేసిన తర్వాత దుస్తులను తిరిగి వారికి అప్పగించేది.
ఆదివారం రాత్రి దుస్తులు ఇచ్చేందుకు వెళ్లిన తమ కూతురు తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. రాత్రి 2గంటల వరకు వారు ఆమె కోసం వెదికారు. సోమవారం 6 గంటల ప్రాంతంలో అర్ధనగ్నంగా ఉన్న ఆమె మృతదేహం ఓ ఖాళీ ప్లాట్లో లభ్యమైంది. బాలిక ప్రైవేటు భాగాలపై గాయాలున్నాయి. ఆమెను రేప్ చేసిన అనంతరం దుండగులు హత్య చేసి ఇక్కడి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతనే ఈ విషయం వెల్లడవుతుందని పోలీసులు చెప్పారు. బాలిక మృతదేహం పడివున్న ఆ ప్లాట్ హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా)కు సంబంధించినదని తెలిపారు. అక్కడ బస్సు డ్రైవర్లు కొందరు అక్రమంగా తమ వాహనాలను పార్క్ చేస్తుంటారని, రాత్రుళ్లలో డ్రైవర్లు, క్లీనర్లు మద్యం సేవిస్తారని స్థానికులు తెలిపారు. తాము హుడాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.