దారుణం: బాలికపై రేప్ చేసి రాళ్లతో కొట్టి చంపారు
జంషెడ్పూర్: జార్ఖండ్లోని జంషద్పూర్లో కొత్త సంవత్సరం రోజున జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పదకొండేళ్ల బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పాశవికంగా రాళ్లతో కొట్టి చంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసదెరా గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక కొత్తసంవత్సరం రోజున సమీపంలోని అడవిలోకి వెళ్లింది. తిరిగి వస్తుండగా.. బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం వారి నేరం బయటపడకూడదని ఆమెను రాళ్లతో కొట్టి హతమార్చారు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఊరంతా గాలించారు. చివరకు అడవిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
బాలిక మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి గ్రామానికి చెందిన వారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.