శ్రామిక్ రైళ్లు... 110 మంది వలస కార్మికులు మృతి... షాకింగ్ డేటా..
శ్రామిక్ రైళ్లు ప్రారంభించిన మే 1 నుంచి ఇప్పటివరకూ వివిధ రైల్వే స్టేషన్ల ఆవరణలో 110 మంది వలస కార్మికులు మృతి చెందారు. ఇందులో కొందరు అనారోగ్యంతో,కొందరు కోవిడ్ 19తో మృతి చెందారు. రైల్వే పట్టాలపై గుర్తించిన మృతదేహాలను ఈ జాబితాలో చేర్చకపోవడం గమనార్హం.వలస కార్మికులకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. దాని ప్రకారం లాక్ డౌన్ కారణంగా నగరాల్లో చిక్కుకుపోయిన దాదాపు 63.07లక్షల మంది వలస కార్మికులను 4611 శ్రామిక్ రైళ్ల ద్వారా తరలించారు.
కేంద్రం ఏమంటున్నది...
వలస కార్మికులపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసుతో సహా వివిధ అధికారిక ఫోరమ్స్లో ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. రైల్వే ఆవరణలో మరణించిన వలస కార్మికుల్లో ఏ ఒక్కరూ ఆహారం,నీళ్లు అందక చనిపోయిన దాఖలా లేదని పేర్కొంది. శ్రామిక్ రైళ్లలో ప్రభుత్వమే ఉచితంగా ఆహారం,నీళ్లు సప్లై చేసినట్లు వెల్లడించింది.
సగటున 75 మంది...
ఒక డేటా ప్రకారం... 2019లో సగటున ప్రతీ రోజూ 75 మంది రైల్వే ఆవరణలో మృతి చెందారు. ఇందులో సహజ మరణాలు, రైలు పట్టాలు దాటుతుండగా సంభవించిన మరణాలు,కదులుతున్న రైల్లో నుంచి స్తంభాలకు ఢీకొని సంభవించిన మరణాలు ఉన్నాయి. అయితే 2019లో రైలు ప్రమాదాల కారణంగా ఒక్క మరణమూ సంభవించకపోవడం గమనార్హం. ఆయా రాష్ట్రాల్లో ఈ డేటాను అక్కడి రైల్వే పోలీసులే సేకరిస్తుంటారు.
రైల్వే పరిహారం...
రైల్వే ఆవరణలో ఏదైనా అవాంఛనీయ సంఘటనతో మృతి చెందినవారికి మాత్రమే రైల్వే నుంచి పరిహారం అందుతుంది. సాధారణంగా ప్రతీ నెలా దాదాపు 700 దరఖాస్తులు పరిహారం కోరుతూ రైల్వే ట్రిబ్యునల్లో దాఖలవుతుంటాయి. ఇందుకోసం రైల్వే ప్రతీ నెలా రూ.8లక్షలు ఖర్చు చేస్తుంది. రైల్వే మాజీ ఛైర్మన్ ఒకరు దీనిపై మాట్లాడుతూ... చట్ట ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం పొందే హక్కు ఉంటుందన్నారు. రైల్లో ప్రయాణిస్తూ మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబాలు లేదా బంధవులకు గతంలో రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ పరిహారం అందజేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
Recommended Video
లాక్ డౌన్తో వలస కార్మికుల కష్టాలు...
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది మార్చి 25వ తేదీ రాత్రి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఉన్నపళంగా ఉద్యోగ,ఉపాధి కోల్పోవడంతో వారి పరిస్థితి రోడ్డున పడ్డట్లయింది. దీంతో వేలాది మంది వలస కార్మికులు కాలి నడకనే వేల కి.మీ నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎంతోమంది మార్గమధ్యలోనే చనిపోయారు. సుమారు 2 నెలల తర్వాత లాక్ డౌన్ నిబంధనలను సడలించిన ప్రభుత్వం వలస కార్మికుల తరలింపు కోసం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం వాళ్లే ప్రయాణ చార్జీలను భరించాలన్న కేంద్రం పెట్టిన నిబంధనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ డబ్బులతోనే కార్మికులను స్వస్థలాలకు చేర్చాయి.