డయల్ 112.. వన్ ఇండియా, వన్ ఎమర్జెన్సీ నెంబర్.. రాష్ట్రాలతో అనుసంధానం
ఢిల్లీ : అత్యవసర సేవల్ని ఒకే గొడుకు కిందకు చేర్చింది కేంద్ర ప్రభుత్వం. వైద్య సాయం కోసం ఒక నెంబర్, పోలీసుల సాయం కోసం మరో నెంబర్.. ఇకపై అలాంటి సేవల్ని ఒకే నెంబరుతో పొందడానికి మార్గం సుగమమైంది. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అత్యవసర సమయాల్లో సేవలందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ పాన్ ఇండియాను తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే ఒక్క నెంబర్ ఉండేలా డయల్ 112 హెల్ప్లైన్ నంబర్ ప్రారంభించింది.
వన్ ఇండియా.. వన్ నెంబర్
రోడ్డు, అగ్ని ప్రమాదాల్లో బాధితులకు ఎమర్జెన్సీ సర్వీసులు అందించడానికి 108 హెల్ప్ లైన్.. పోలీసుల సాయం కోసం డయల్ 100.. గ్రామీణ వైద్య సేవల కోసం 104.. ఇలా ఒక్కో అత్యవసర సేవకు ఒక్కో నెంబర్ కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆయా రాష్ట్రాల ప్రాధమ్యాల మేరకు ఈ నెంబర్లు మారుతుంటాయి. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, దేశవ్యాప్తంగా ఒకే ఒక్క నెంబరుతో ఎమర్జెన్సీ సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
వన్ ఇండియా, వన్ ఎమర్జెన్సీ నెంబర్ 112 ట్యాగ్ లైన్ తో సరికొత్త హెల్ప్ లైన్ తీసుకొచ్చింది. అన్ని రకాల అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS) ను అభివృద్ధి చేశారు. అమెరికాలో ఇప్పటికే ఇలాంటి విధానం అమలవుతోంది. ఎక్కడినుంచైనా ఆ దేశమంతటా ఒకటే ఎమర్జెన్సీ సర్వీస్ డయల్ 911 అందుబాటులో ఉంది.
పొలిటికల్ టర్న్ : 24 ఏళ్ల శత్రుత్వానికి బ్రేక్.. ఒకే వేదికపై ములాయం, మాయావతి
20 రాష్ట్రాలకు విస్తరించిన సేవలు
ఫైర్ యాక్సిడెంట్లు, పోలీస్ సాయం, ఆరోగ్య సేవలు.. తదితర ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112 హెల్ప్ లైన్ నెంబర్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. శుక్రవారం (19.04.2019) నాడు మరికొన్ని రాష్ట్రాలను అనుసంధానిస్తూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ డయల్ 112 ను అందుబాటులోకి తెచ్చారు. మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకుని 20 రాష్ట్రాలకు ఈ సేవలు విస్తరించినట్లైంది.
పాన్-ఇండియా నెట్వర్క్ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, జమ్ముకశ్మీర్, నాగాలాండ్, డామన్ డయ్యు, దాద్రానగర్ హవేలి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్ల నుంచి డయల్ చేస్తే బెటర్
ఎవరైనా ఈ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలంటే ల్యాండ్ ఫోన్ల నుంచి 112 నెంబరుకు డయల్ చేస్తే.. నెట్వర్క్ టవర్ ఆధారంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్కు కనెక్ట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ల నుంచి డయల్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా ఎక్కడినుంచి ఫోన్ చేస్తున్నారో కచ్చితమైన సమాచారం లభించి సేవలు సత్వరమే అందడానికి వీలవుతుందట. స్మార్ట్ ఫోన్లలో పవర్ బటన్ను మూడు సార్లు నొక్కడం ద్వారా డయల్ 112 హెల్ప్ లైనుకు కనెక్ట్ అవుతుంది. 5 లేదా 9 ని లాంగ్ ప్రెస్ చేస్తే కూడా కనెక్టయ్యేలా అవకాశం ఉంది.
మొబైల్ యాప్ కూడా ఉందిగా..!
పాన్ ఇండియా డయల్ 112 ఈఆర్ఎస్ఎస్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయి ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అభ్యర్థించవచ్చు. అంతేకాదు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో 112 ఇండియా మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. దీని నిర్వహణ కోసం నిర్భయ నిధుల నుంచి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. మొత్తం 321 కోట్ల 69 లక్షల రూపాయలు కేటాయించగా.. ఇప్పటివరకు 278 కోట్ల 66 లక్షల రూపాయలు విడుదల చేసింది.