కేంద్రం నిఘాలో 1181 మంది ఐపీఎస్ అధికారులు: ఏబీ వెంకటేశ్వర రావు ఎఫెక్టేనా?
న్యూఢిల్లీ: ఎన్నికల పోలింగ్కు కొద్దిరోజుల ముందు.. మన రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను అంత సులువుగా ఎవరూ మర్చిపోలేరు. ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులు అందుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన విషయం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సహా శ్రీకాకుళం, కడప జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను రాత్రికి రాత్రి బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసేంత వరకు వారికి ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా కూడా బదిలీ కావాల్సి వచ్చింది.
ఈ ఘటన తరువాత కేంద్రప్రభుత్వం అప్రమత్తమైనట్టుంది. ఇలాంటి రాజకీయ కారణాలు మాత్రమే కాకపోయినప్పటికీ.. వంద కాదు, రెండొందలూ కాదు.. ఏకంగా 1181 మంది ఐపీఎస్ అధికారులపై నిఘా పెట్టింది. వారి పనితీరుపై నివేదికలను తెప్పించుకుంటోంది. చాప కింద నీరులా వారి ఆనుపానులను తెలుసుకుంటోంది కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ. రాజకీయ కారణాలు మాత్రమే కాకుండా.. వారి పనితీరుపై ఆరా తీస్తోంది. అదనపు సంపాదన పైనా కన్ను వేసింది. 1181 మంది ఐపీఎస్ అధికారుల పనితీరు ఏ మాత్రం బాగోలేదంటూ నివేదిక అందినట్లు తెలుస్తోంది. ఆయా అధికారుల పరిధిలోని శాంతి భధ్రతల మాట అటుంచితే- సాధారణ కేసులు కూడా నిర్ణీత గడువులోగా పరిష్కారం కావట్లేదని తేలినట్లు సమాచారం.
అఖిల భారత సర్వీసుల (మరణం-పదవీ విరమణ తరువాతి ప్రయోజనాలు) చట్టం-1958లోని రూల్ నంబర్ 16 (3) ఆధారంగా ఐపీఎస్ అధికారుల పనితీరు, సర్వీస్ రికార్డులను పరిశీలించడానికి కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ అధికార ఉంది. దీని ఆధారంగా- ఐపీఎస్ అధికారుల రికార్డులను తెప్పించుకుంటోంది. దేశవ్యాప్తంగా 1181 మంది అధికారుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉన్నట్లు తేలినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా కేంద్ర సర్వీసులు, అన్ని రాష్ట్రాల్లో మొత్తం 3,972 మంది ఐపీఎస్ అధికారులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. 4,940 మంది ఐపీఎస్ అధికారులు అవసరం. సుమారు వెయ్యిమంది వరు ఐపీఎస్ అధికారుల కొరత ప్రస్తుతం దేశంలో నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న అధికారుల పనితీరు ఎలా ఉందనే అంశంపై కొంతకాలంగా హోమ్ మంత్రిత్వశాఖ ఆరా తీస్తోంది. దీనికి మూడేళ్ల సర్వీసు కాలాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. చాలామంది అధికారులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల నాయకులకు అనుకూలంగా పని చేస్తుండటమో లేదా, వారి ఆగ్రహానికి గురై, ప్రాధాన్యత లేని పోస్టుల్లో కొనసాగుతోండటమో జరుగుతోందని హోమ్ మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు తమ విధి నిర్వహణలో విఫలం కావడానికి రాజకీయ కారణాలు కూడా ప్రధానంగా ఉంటున్నాయని అంటున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సహా కడప ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు సహా మరికొందరు కీలక హోదాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల అనంతరం- ఎన్నికల సంఘం ముగ్గురిపైనా నిఘా వేసింది. వారి పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అధికార పార్టీ వైపునకు మొగ్గు చూపుతున్నట్లు తేలడంతో బదిలీ వేటు వేసినట్లు వార్తలు వెల్లువెత్తాయి.
కౌంటింగ్ ఏజెంట్ల కోసం వైఎస్ఆర్సీపీ నాయకత్వం..కీలక సందేశం!