అదే పీటముడి... ఎటూ తేలని ప్రతిష్ఠంభన... ఆ షరతుకు ఒప్పుకుంటేనే మళ్లీ చర్చలన్న కేంద్రం...
మళ్లీ అదే కథ... రైతులతో కేంద్రం జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో మాదిరే ఈసారి చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. గతంలో చర్చలు విఫలమైనప్పుడు మరోసారి చర్చలకు అవకాశం కల్పించిన కేంద్రం ఈసారి మాత్రం తదుపరి చర్చలకు గట్టి ఫరతు విధించింది. ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాలను పక్కనపెడుతామన్న కేంద్రం ప్రతిపాదనకు రైతులు అంగీకరిస్తేనే మరోసారి చర్చలు జరుపుతామని తేల్చి చెప్పింది. అటు రైతులు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Recommended Video
కేంద్రం మమ్మల్ని అవమానించింది : రైతులు
తాజా చర్చల పట్ల రైతులు తీవ్ర అసంతృప్తిని,అసహనాన్ని వ్యక్తం చేశారు. చర్చల కోసం దాదాపు మూడున్నర గంటల పాటు తమను వెయిట్ చేయించి కేంద్రం ఒకరకంగా తమను అవమానించిందని మండిపడ్డారు. తాజా చర్చలు కూడా విఫలమవడంతో తమ ఆందోళనలు కొనసాగుతాయని... రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరుతామని రైతు సంఘాల నేతలు తెలిపారు. కేంద్రంతో చర్చలు ముగిసిన అనంతరం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ నేత ఎస్ఎస్ పంధేర్ మీడియాతో మాట్లాడుతూ... 'కేంద్రమంత్రి మమ్మల్ని మూడున్నర గంటలు వెయిట్ చేయించారు. ఇది రైతులను అవమానించడమే. వచ్చీ రాగానే... వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా పక్కన పెట్టే ప్రతిపాదనను ప్రస్తావించారు. ఆ ప్రతిపాదనకు ఒప్పుకోమని చెబుతూనే చర్చల ప్రక్రియను ఇక ముగిస్తున్నామన్నారు.' అని తెలిపారు.
ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతాం : రైతులు
భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ తికైత్ మాట్లాడుతూ... ముందుగా నిర్ణయించిన ప్రకారం రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కేంద్రం తాజా ప్రతిపాదనకు రైతు సంఘాలు అంగీకరిస్తేనే మరో దఫా చర్చలు జరుపుతామని తాజా చర్చల్లో కేంద్రమంత్రి చెప్పారన్నారు. రైతు సంఘాలు ఇప్పటికే ముక్తకంఠంతో ఈ ప్రతిపాదనను ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. బీకేయూ క్రాంతికారి అధ్యక్షుడు సూర్జిత్ సింగ్ ఫూల్ మాట్లాడుతూ... తదుపరి చర్చలపై కేంద్రం తేదీని నిర్ణయించలేదన్నారు.
మరోసారి చర్చించుకోనున్న రైతు సంఘాలు...
జాతీయ మీడియా కథనం ప్రకారం... చర్చల్లో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్... ఇది మంచి అవకాశమని,కేంద్రం ప్రతిపాదనకు ఒప్పుకోవాలని రైతు సంఘాలను కోరారు. దీనిపై రైతు సంఘాలు మరోసారి తమలో తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గేది లేదని కూడా చెప్పినట్లు సమాచారం. శనివారం(జనవరి 22) రైతు సంఘాల నేతలు తమ నిర్ణయాన్ని కేంద్రానికి వెల్లడించే అవకాశం ఉంది.