12 వేల మంది పరిక్షలు రాస్తే 20 వేల మంది పాస్
ఆగ్రా: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ అధికారులు షాక్ కు గురైనారు. 12 వేల మంది పరిక్షలు రాస్తే ఏకంగా 20 వేల మందికి పైగా పాసైనారని రిజల్ట్ తయారు చేశారు. ఫలితాలు ప్రకటించే సమయంలో నాలుక కరుచుకుని ఫలితాల విడుదల వాయిదా వేశారు.
అధికార దుర్వినియోగం చేసిన వారిని గుర్తించడానికి ప్రత్యేక కమిటితో విచారణ చేయిస్తున్నామని యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ మహమ్మద్ ముజమ్ముల్ స్పష్టం చేశారు. 2014-15 సంవత్సరంలో యూనివర్శిటీ నుంచి 12,822 మంది విద్యార్థులు బీఈడీ పరిక్షలు రాశారు.
ఈ విషయాన్ని యూనివర్శిటీ అధికారులు పరిక్షలు పూర్తి అయిన తరువాత అధికారికంగా వెల్లడించారు. అయితే ఫలితాలు ప్రకటించే సమయానికి లెక్కలు మారిపోయాయి. పరిక్షలలో 20,089 మంది పాసైనారని గణాంకాలు చూసి షాక్ కు గురైనారు.
యూనివర్శిటీ బీఈడీ పరిక్షల ఫలితాలు లిస్టును తయారు చెయ్యడానికి ఓ ప్రయివేటు ఏజెన్సీని నియమించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. యూనివర్శిటీ పరిధిలోని ప్రయివేటు కళశాలలు నియమాలు ఉల్లంఘించడం వలనే ఇలా జరిగిందని వెలుగు చూసింది.
పరిక్షలు మొదలైన రోజు కూడా కొన్ని కాలేజ్ లలో విద్యార్థులను చేర్చుకున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. విద్యార్థుల లిస్టు తీసుకురావాలని కాలేజ్ యాజమాన్యాలకు యూనివర్శిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.