అసోం మార్కెట్ లో ఉగ్రదాడి: 12 మంది బలి
అసోం: అసోంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో సామాన్య ప్రజలు బలి అయ్యారు. ఉగ్రవాదులు తప్పించుకుని సమీపంలోని భవనాలలో మకాం వేశారు.
ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉగ్రవాదులు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. అసోంలోని కోక్రాఝర్ లోని మార్కెట్ దగ్గర నిత్యం రద్దీగా ఉంటుంది. శుక్రవారం మద్యాహ్నం 2.10 గంటల సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఒక్క సారిగా మార్కెట్ లో కాల్పులు జరిపారు.
ఉగ్రదాడిలో 12 మంది సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల మీద ఎదురుకాల్పులు జరిపారు. భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ఓ ఉగ్రవాది మరణించాడని తెలిసింది.
పలువురుకి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడులు చేశారు అని తెలియడం లేదు. ముందు జాగ్రత్త చర్యగా అసోంలో గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి గురించి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించారు.