వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి హెచ్చరిక: ఎన్ఎంసీలో దిద్దుబాట్లు చేయకుంటే ఆందోళన తప్పదన్న వైద్యులు.. నేడు దేశవ్యాప్త బంద్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి ప్రత్యామ్నాయంగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ని ప్రతిపాదిస్తూ కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుపై వైద్య రంగం మండిపడుతోంది. తమను పూర్తిగా అధికార యంత్రాంగం నియంత్రణలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు ఆయుర్వేదం, హోమియోపతి వైద్యులు కూడా బ్రిడ్జి కోర్సు పూర్తి చేస్తే అల్లోపతి వైద్యం చేయవచ్చునని చేర్చిన నిబంధనపై వివాదం చెలరేగుతున్నది. దీనికి తోడు మెడికల్ కాలేజీలకు అనుమతులు, ఆయా కాలేజీల్లో వసతులకు అనుగుణంగా సీట్ల పెంపు తదితర అంశాలపై ఇప్పటివరకు అమలుచేసిన కఠిన ప్రమాణాలు, నిబంధనలకు తిలోదకాలివ్వడాన్ని వైద్య ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రతిపాదిత బిల్లులో మార్పులు చేయాల్సిందేనని, లేదంటే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 12 గంటల బంద్ పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది.

 బ్రిడ్జి కోర్సు పూర్తితో వైద్య కోర్సులన్నీ సమానమేనా?

బ్రిడ్జి కోర్సు పూర్తితో వైద్య కోర్సులన్నీ సమానమేనా?

భారత్ సంప్రదాయ వైద్య పద్ధతులైన ఆయుర్వేదం, హోమియోపతి వైద్యులు ఒక బ్రిడ్జి కోర్సు పూర్తి చేస్తే తర్వాత సాధారణ వైద్య సేవలు అందించొచ్చునన్న ప్రతిపాదన అంతా బూటకం అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఆరోపిస్తున్నది. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఐఎంఎ ప్రతినిధులు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు వివరించారు. అయితే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత తామేమీ చేయలేమని కేంద్ర ఆరోగ్యశాఖ అధికార వర్గాలు చేతులెత్తేశాయి.

 నేడు ఔట్ పేషంట్ విభాగం సేవలు బంద్

నేడు ఔట్ పేషంట్ విభాగం సేవలు బంద్

గత శుక్రవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మంగళవారం పార్లమెంట్ లో చర్చలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభలే ఎన్ఎంసీ బిల్లు భవితవ్యాన్ని నిర్దేశిస్తాయని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తేల్చేశారు. దీంతో బంద్ పిలుపు మేరకు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అత్యవసర, కీలకమైన కేసులు మినహా ఔట్ పేషంట్ సేవలు పూర్తిగా నిలిపివేస్తారు.

 వైద్య రంగంపై పట్టు బిగిస్తున్న అధికార యంత్రాంగం

వైద్య రంగంపై పట్టు బిగిస్తున్న అధికార యంత్రాంగం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్ఎంసీ బిల్లును ఐఎంఏ గట్టిగా వ్యతిరేకిస్తోంది. వైద్య వ్రుత్తిని పూర్తిగా అధికారులు, వైద్యేతర రంగాల అధికారుల నియంత్రణలోకి తీసుకొస్తున్నారని ఐఎంఎ వాదిస్తోంది. మంగళవారాన్ని ‘బ్లాక్ డే'గా పాటిస్తామని చెబుతోంది. ప్రస్తుత రూపంలో ఎన్ఎంసీ బిల్లును ఏమాత్రం ఆమోదించే ప్రసక్తే లేదని ఐఎంఎ నూతన అధ్యక్షుడు డాక్టర్ రవి వాంఖేడ్కర్ తేల్చి చెప్పారు. ఇది పేదల వ్యతిరేక, ప్రజల వ్యతిరేక, అప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన బిల్లు అని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల పాటు బంద్ పాటించాలని వైద్యులకు డాక్టర్ రవి వాంఖేడ్కర్ పిలుపునిచ్చారు.

 ఐఎంఏకు ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ మద్దతు

ఐఎంఏకు ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ మద్దతు

‘మేం రోగులు, ప్రజల అంశాలను లేవనెత్తడానికి ఆందోళన తప్ప మరో మార్గం లేదు. బంద్ పాటించాలని ఐఎంఎ తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా వైద్యుల నుంచి అద్భుతమైన ప్రతిస్పందన లభిస్తున్నది' అని డాక్టర్ రవి వాంఖేడ్కర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐఎంఏలో 2.77 లక్షల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు. మరోవైపు ఐఎంఏ ఆందోళనకు ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ (డీఎంఏ) మద్దతు పలికింది. దేశ రాజధాని పరిధిలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఔట్ పేషంట్ సర్వీసులు నిలిపివేయాలని డీఎంఏ పిలుపునిచ్చింది.

 ప్రధాని మోదీ, ఆరోగ్య మంత్రి నడ్డాలకు అగర్వాల్ లేఖ

ప్రధాని మోదీ, ఆరోగ్య మంత్రి నడ్డాలకు అగర్వాల్ లేఖ

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ ఇప్పటికే ప్రతిపాదిత నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును తిరగరాయాలని, పొరపాట్లను సరిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాలను అభ్యర్థిస్తూ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా మెడికల్ ప్రాక్టీషనర్ల ప్రయోజనాల పరిరక్షణకు కొన్ని నిబంధనలను సరిదిద్దాల్సిందేనని స్పష్టం చేశారు. బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన ‘ఆయుష్' గ్రాడ్యుయేట్లను అల్లోపతి వైద్య సేవలను అనుమతించడం ద్వారా బూటకపు వైద్య విధాన పద్ధతులను ప్రోత్సహించడమేనని డాక్టర్ అగర్వాల్ ఆరోపించారు. ఆధునిక వైద్య సేవలందించేందుకు ప్రాథమిక విద్యార్హతగా ‘ఎంబీబీఎస్'ను నిర్దేశిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) చట్టంలోని 15వ సెక్షన్‌ను ప్రతిపాదిత ఎన్ఎంసీ బిల్లులో యథాతథంగా చేర్చాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

 ప్రభుత్వ చర్య తిరోగమనం అని వాదిస్తున్న ఐఎంఏ

ప్రభుత్వ చర్య తిరోగమనం అని వాదిస్తున్న ఐఎంఏ

‘ప్రతి వైద్యుడు తమ మెడికల్ కౌన్సిల్ ను ఎన్నుకునేందుకు గల హక్కును ప్రతిపాదిత ఎన్ఎంసీ బిల్లు హరించి వేస్తుంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వైద్య నిపుణులకు ప్రాతినిధ్య సంస్థగా భారత వైద్య మండలి (ఎంసీఐ) ఉంది. దేశంలోని ప్రతి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కూడా ఎంసీఐ సభ్యుడిగా పోటీ చేసేందుకు, ఓటేసేందుకు హక్కు కలిగి ఉన్నారు. కానీ ప్రతిపాదిత ఎన్ఎంసీ బిల్లు ఈ నిబంధనలను, హక్కులను పూర్తిగా తొలగించి వేస్తున్నది. ప్రజాతంత్రయుతంగా వైద్యులంతా ఎన్నుకునే ఎంసీఐ స్థానే ఏర్పాటయ్యే ఎన్ఎంసీలో పూర్తిగా ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతినిధులతోనే నింపివేస్తున్నది. ఇది తిరోగమన చర్య అని డాక్టర్ అగర్వాల్ ఆరోపించారు.

 ‘ఎన్ఎంసీ'తో అవినీతి వరదకు గేట్లెత్తడమేనని వాదిస్తున్న ఐఎంఏ

‘ఎన్ఎంసీ'తో అవినీతి వరదకు గేట్లెత్తడమేనని వాదిస్తున్న ఐఎంఏ

ప్రస్తుత రూపంలోని ఎన్ఎంసీ బిల్లు చట్టంగా మారితే వైద్య విద్యా కోర్సు నిర్వహణ పూర్తిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల చేతుల్లోకి వెళ్లిపోతుంది. వైద్యవిద్యలో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న ‘నీట్' అందిస్తున్న వెసులుబాటును పూర్తిగా ఈ బిల్లు నిర్వీర్యం చేస్తుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఎంసీఐలో అవినీతిని నిర్మూలించేందుకు ఎన్ఎంసీని ప్రతిపాదిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం.. పూర్తిగా అవినీతి వరదకు గేట్లెత్తుతున్నదని ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ వాంఖేడ్కర్ ఆరోపించారు. వైద్య నిపుణుల ఆమోదం లేకుండా వైద్య విద్య, వైద్య సేవల నియంత్రణ అన్నది ఒక విపత్తుగా మారిపోతుందని డాక్టర్ వాంఖేడ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.

 వైద్య విద్య, చికిత్స పర్యవేక్షణకు నాలుగు స్వతంత్ర మండళ్లు

వైద్య విద్య, చికిత్స పర్యవేక్షణకు నాలుగు స్వతంత్ర మండళ్లు

ప్రతిపాదిత ఎన్ఎంసీ బిల్లులోని 49వ నిబంధన ప్రకారం నేషనల్ మెడికల్ కమిషన్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఏడాదికోసారి సమావేశమై హోమియోపతితోపాటు దేశంలోని సంప్రదాయ వైద్య విధానాలు, ఆధునిక వైద్య విధానాల మధ్య సమన్వయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్ఎంసీ పరిధిలో ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీ కోర్సుల నిర్వహణ, వైద్య సంస్థలకు రేటింగ్, వైద్య ప్రాక్టీషనర్ల రిజిస్టేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాలుగు స్వతంత్ర మండళ్లను ఏర్పాటు చేస్తుంది. ఎన్ఎంసీ చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీ సారథ్యంలోని సెర్చ్ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది.

 వైద్య సేవలకు అంతరాయం కలిగించొద్దని అడ్వైజరీ ఆదేశం

వైద్య సేవలకు అంతరాయం కలిగించొద్దని అడ్వైజరీ ఆదేశం

వైద్యుల సమ్మె తీవ్రతను గుర్తించిన కేంద్రం వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. ప్రభుత్వ ఆసుపత్రులు 12 గంటల బంద్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ హాస్పిటళ్లకు హెచ్చరికలతో కూడిన అడ్వైజరీ జారీ చేసింది. ప్రత్యేకించి న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), సఫ్దర్ జంగ్ హాస్పిటల్ అనుబంధ లేడీ హార్డింగే మెడికల్ కాలేజీ, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ అధికారులకు దేశాలు జారీ చేసింది. పేషంట్ల ఆరోగ్య రక్షణ, ఎమర్జెన్సీ సేవలు సజావుగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించింది. పేషంట్ల సంరక్షణ చర్యలకు ఏమాత్రం అవాంతరం ఉండకూడదని హఎచ్చరికలు జారీ చేసింది. సజావుగా వైద్య సేవలు జరిగేలా చూడాలని ఆదేశించింది. మంగళవారం పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని వైద్యాధికారులను ఆదేశించింది

English summary
New Delhi: Healthcare services at many private hospitals in the country are likely to be hit on Tuesday as the Indian Medical Association has called for suspending routine services for 12 hours to protest a Bill seeking to replace the Medical Council of India (MCI) with a new body and also proposes allowing practitioners of alternative medicines practise allopathy after completing a "bridge course".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X