చెమటలు కక్కించిన నాగా: పోలీసులు అవాక్కు, భార్య దబాయింపు
నాగరాజ్ ఇంట్లోకి అడుగు పెట్టి గది తాళం తీసిన పోలీసులు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. అతని భార్య మాటలు వారిని నివ్వెరపరిచాయి.
బెంగళూరు: పోలీసులు బురఖాలు వేసుకుని కాపు కాసి, పట్టుకునేందుకు ప్రయత్నించినా రౌడీ షీటర్, మాజీ కార్పోరేటర్ నాగరాజ్ అలియాస్ నాగా తప్పించుకున్నాడు. శుక్రవారం ఉదయం పోలీసులు సోదాలు చేసినప్పుడు నాగరాజ్ నివాసంలో పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి.
వ్యాపారిని అపహరించిన కేసులో విచారించడానికి పోలీసులు అతని నివాసానికి చేరుకున్నారు. కానీ అతను పక్కా ప్లాన్తో పరారయ్యాడు. తన ఇంటి పక్కనే నిర్వహించే స్నేహ సేవా సమితి భవనంలో అతను తలదాచుకున్నట్లు గుర్తించి పట్టుకునేందుకు వెళ్లిన 70 మంది పోలీసులకు నాగా చెమటలు పట్టించాడు.
పోలీసులు వచ్చారని గుర్తించి అతను అనుచరుల సహాయంతో భవనానికి తాళాలు వేయించి, తాళం చెవులను తన వద్ద భద్రపరుచుకున్నాడు. దాంతో లోనికి ప్రవేశించడం సాధ్యం కాలేదు. లోపలి నుంచే అతని పోలీసులతో గొడవకు దిగాడు. పోలీసులు హెచ్చరించినా అతను బయటకు రాలేదు.
బయటి తాళాలు బలవంతంగా తెరిచారు. అయితే, లోపల గడియ పెట్టినట్లు గుర్తించారు. దాంతో కిటికీ ఊచలు పగులగొట్టించి, దాంట్లోంచి తాళాలు బాగు చేయించే వ్యక్తిని పంపించారు. అతనితో లోపలి నుంచి తాళాలు తీయించారు. అప్పటికే నాగా అక్కడి నుంచి పారిపోయాడు.
రెండో అంతస్థులో ఉన్న ఐదు గదులను పోలీసులు సీజ్ చేశారు. దాంట్లో ఒకదాన్ని తెరిచేందుకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుస్తీ పట్టారు. అక్కడి దృశ్యం చూసి పోలీసులు అవాక్కయ్యారు. 15 ట్రావెల్ బ్యాగుల్లో నగదు కనిపించింది. తహిసీల్దార్ అనుమతితో మరో గది తెరిచారు.
సంచుల్లో సిమెంట్ ఇటుకలు, పుస్తకాల మధ్య వరుసగా పేర్చిన నోట్లకట్టలు, ఆస్తుల పత్రాలు ఉన్నాయి. వాటిలో కోట్లాది రూపాయల నగదుతో పాటు దొంగ నోట్ల ముద్రణకు వాడే ఖాళీ కరెన్సీ కాగితం, కత్తులు, బాకులు, వేట కొడవళ్లు కనిపించాయి. ఈ సోదాలను పూర్తిగా వీడియో తీయించారు .మిగతా గదులను రాత్రి పొద్దు పోయేంత వరకు తెరిచి చూశారు.
శ్రీరామపుర వార్డులోనే నాగరాజ్కు ముడు ఇళ్లు, ఒక ట్రస్టు భవనం, ఓ వాణిజ్య సముదాయం ఉన్నట్లు పోలీసు అధికారి హేమంత్ నింబాళ్కర్ చెప్పారు. ట్రస్టు కార్యాలయం రెండో అంతస్తులో ప్రత్యేకంగా తయారు చేయించుకున్న మంచం లోపల నోట్ల కట్లు పేర్చి ఉన్నాయి. ఇళ్లు, ట్రస్టు భవనం, వాణిజ్య ముదాయాలకు ఒక్కో దానికి 30 వరకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు.
తాను ఉంటున్న చోటికి ఎవరు వచ్చినా వెంటనే గుర్తించే ఏర్పాటు కూడా చేసుకున్నాడు. ఇళ్ల పై నుచి లోనికి ఎవరూ ప్రవేశించకుండా పిట్టగోడల వద్ద, కిటికీల వద్ద. తలుపుల వద్ద ముళ్ల తీగెలను ఏర్పాటు చేసుకున్నారు. వాటికి విద్యుత్తు ప్రసారం కూడా ఉంటుంది.
పోలీసులు శుక్రవారం ఉదయం వచ్చి ఇంటి తలుపు తట్టారు. నాగరాజ్ భార్య తలుపు తీసి, వచ్చినవాళ్లు పోలీసులను గుర్తించింది. నాగరాజ్ ఎక్కడున్నాడని పోలీసులు ప్రశ్నించారు. మీరు పోలీసులే కదా... వెతుక్కోండి, నన్ను ఎందుకు అడుగుతారు అని దబాయించింది.
నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ నగదు విషయం ఆమెను అడిగారు. అది మీరే పెట్టి ఉంటారు, నాకేం తెలుసునని బుకాయించింది. నాగరాజ్ ఎక్కడని అడిగితే నేను ఆయనకు కాపలానా అని అడిగింది. ఇంట్లో సోదాలు చేసే సమయంలో నాగరాజ్ కూతురు పోలీసులతో గొడవ పడింది.
అర్థరాత్రి ఇంటికి చేరుకునే నాగరాజ్ తెల్లవారు జామునే వెళ్లిపోయేవాడు. తన ట్రస్టు భవనం మొదటి అంతస్థును అతను కార్యాలయంగా వాడుకునే వాడు. అక్కడి నుంచే అతను క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవాడని తెలుస్తోంది.
హొణ్ణూరు స్టేషన్లో కేసు నమోదు కాగానే అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు నాలుగు రోజుల పాటు ప్లాన్ వేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోగానే నాగరాజ్కు సమాచారం అందేది. తలుపులకు తాళాలు వేసుకుని పారిపోతూ వచ్చాడు. ఇలా నాలుగు సార్లు జరిగింది.
దాంతో లాభం లేదనుకుని పోలీసు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు బురఖాలు వేసుకుని శ్రీరామపురానికి గురువారం సాయంత్రం వచ్చారు. నాగరాజ్ నివాసం వద్ద, ట్రస్టు కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఐదుగురు సిబ్బందితో శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. నాగరాజ్ తలుపులను వేసుకుని ట్రస్టు భవనానికి పరిమితం కావడంతో ఎక్కువ మంది సిబ్బందిని పిలిపించారు.
నాగరాజ్ పోలీసులకు చిక్కితే పెద్ద కుంభకోణమే బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. నెలమంగళ, దేవనహళ్లి సమీపంలో అతనికి రెండు ఫామ్ హౌస్లు ఉన్నాయని పోలీసులు గుర్తిచారు.