భారత్ ఒకే ఒక్క డిమాండ్: చైనా చేసిన మొదటి తప్పు అదే.. మైండ్గేమ్: 12 గంటల సుదీర్ఘ భేటీలో
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి సాగుతోన్న ప్రయత్నాలు ముందుకు సాగట్లేదు. ఎలాంటి పురోగతీ కనిపించట్లేదు. ఫలితంగా- లఢక్ సమీపంలోని సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేదు. పైగా రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. రెండు దేశాల భూభాగాలపై మోహరింపులు కొనసాగుతూనే వస్తున్నాయి. సైనిక బలగాల మోహరింపులు తీవ్రం అవుతున్నాయి. వ్యూహాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు దేశాల తరఫున భారీగా యుద్ధసామాగ్రిని తరలించారు.
ఐసీయూ ఆన్ వీల్స్: రోడ్డెక్కనున్న కొత్త అంబులెన్సులు: బెంజ్ సర్కిల్ వద్ద
మూడో దఫా చర్చల్లోనూ ప్రతిష్ఠంభన
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చడానికి భారత్-చైనా దేశాల మధ్య తాజాగా మూడో విడతగా చోటు చేసుకున్న చర్చలు కూడా అర్ధాంతరంగా మూగిశాయి. ఎలాంటి ఫలితాలూ రాలేదు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు రెండు దేశాల లెప్టినెంట్ కమాండర్ స్థాయి అధికారులతో ఆరంభమైన ఈ సమావేశ:.. రాత్రి 11 గంటల వరకూ కొనసాగింది. ఇదివరకు ఈ నెల 6, 22వ తేదీల్లో నిర్వహించిన సమావేశం తరహాలోనే అర్ధాంతరంగా ముగిశాయి. తొలిసారిగా భారత భూభాగంపై ఈ చర్చలు సాగాయి. సరిహద్దులకు ఇవతల ఉన్న ఛుసుల్ ప్రాంతంలో భేటీ కొనసాగింది.
భారత్ డిమాండ్ పట్ల స్పందించని చైనా
ఈ చర్చల సందర్భంగా భారత్ చేసిన డిమాండ్ ఒకే ఒక్కటి.. సరిహద్దుల్లో ఏప్రిల్కు ముందు నాటి పరిస్థితులను తీసుకుని రావడం. ఏప్రిల్కు ముందు వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. అలాంటి వాతావరణాన్నే కల్పించాలని, ఉద్రిక్తతలను తగ్గించడానికి తొలి అడుగు వేయాలంటూ భారత్ ప్రతిపాదించింది. ఈ ఒక్క డిమాండ్కు అంగీకరిస్తే చాలని భారత లెప్టినెంట్ కమాండర్ హర్వీందర్ సింగ్ పదేపదే ప్రస్తావించారు. దీనికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు ఏ మాత్రం అంగీకరించలేదని సమాచారం.
చైనా డొంక తిరుగుడు..
భారత డిమాండ్ పట్ల చైనా లెప్టినెంట్ కమాండర్ లియు లిన్ ఏ మాత్రం అంగీకరించలేదని, పైగా డొంక తిరుగుడు మాటలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించారని అంటున్నారు. చర్చల్లో పాల్గొన్న భారత ఆర్మీ ప్రతినిధులపై మైండ్గేమ్ వ్యూహాన్ని అనుసరించడానికి ప్రయత్నించిదని చెబుతున్నారు. దీన్ని హర్వీందర్ సింగ్ సారథ్యంలోని ఆర్మీ ప్రతినిధులు తిప్పి కొట్టినట్లు తెలుస్తోంది. భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన చైనా.. మొదటి తప్పు చేసిందని, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఆ దేశంపైనే ఉందని భారత్ వాదించినట్లు చెబుతున్నారు.
గాల్వన్ వ్యాలీ సహా..
ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి హాట్స్పాట్గా మారిన గాల్వన్ వ్యాలీని ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భారత ప్రతినిధులు డిమాండ్ చేయగా.. దాన్ని చైనా అంగీకరించలేదని సమాచారం. వంటి ప్రదేశాల్లో ఇప్పటికే చైనా తన సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిని తొలగించాలని భారత ఆర్మీ ప్రతినిధులు పదేపదే డిమాండ్ చేసినప్పటికీ.. చైనా నుంచి ఆశించిన స్పందన రాలేదని అంటున్నారు. ఫలితంగా మూడో విడత చర్చలు కూడా అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరో విడత చర్చలపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ప్రాంతాలు ఖాళీ చేయాల్సిందే..
వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గాల్వన్ వ్యాలీ, పాంగాంగ్ లేక్, ఫోర్ ఫింగర్స్ పాయింట్స్, హాట్ స్ప్రింగ్, పెట్రోల్ పాయింట్-14, పెట్రోల్ పాయింట్స్-15, 17ఏ, గోగ్రా పోస్ట్ వంటి ప్రదేశాల్లో చైనా సైనికులు శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాల్సి ఉంటుందని, ఏప్రిల్కు ముందునాటి పరిస్థితులను పునరుద్ధరించాల్సి ఉంటుందనేది తమ ప్రధాన డిమాండ్ కాగా.. దానికి చైనా అంగీకరించలేదని స్పష్టం చేశారు. డెప్సాంగ్, డెంగ్ఛోక్ ప్రాంతాల ప్రస్తావన కూడా ఈ చర్చల సందర్భంగా రెండు దేశాల ఆర్మీ ప్రతినిధుల మధ్య వచ్చిందని చెబుతున్నారు.